West Bengal: ఎన్ఐఏ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగాల్ పోలీసులు

పశ్చిమ బెంగాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల సోదాలు రాజకీయంగా అలజడిని సృష్టించాయి. టీఎంసీ నాయకుడు మనోబ్రత జనా భార్య ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐఏ అధికారులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సోదాల పేరుతో ఎన్ఐఏ అధికారులు శనివారం అర్ధరాత్రి తన ఇంట్లో చొరబడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని మనోబ్రత జనా భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లోని భూపతినగర్లో 2022 నాటి పేలుడు కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బృందంపై దాడి చేసిన ఘటనకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే టీఎంసీ నేత మోనోబత్రా జానా భార్య ఫిర్యాదు ఆధారంగా ఎన్ఐసీ బృందంపై రాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్ఐఏ అధికారులు తమ ఇంట్లోకి జొరబడి కొట్టారని, అధికారులు తన గౌరవానికి భంగం కలిగించారని టీఎంసీ నేత భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ బృందంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే వ్యవహారంలో ఎన్ఐఏ సైతం భూపతినగర్ పోలీస్ స్టేషన్లో దాడి గురించి గ్రామస్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. వివరాల ప్రకారం.. 2022లో జరిగిన బాంబు పేలుడు ఘటన గురించి దర్యాప్తు కోసం ఎన్ఐఏ బృందం ఆ ప్రాంతానికి వెళ్లడంతో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోల్కతాకు బయలుదేరారు.ఆ సమయంలోనే ఎన్ఐఏ బృందంపై దాడి జరిగింది.
వ్యక్తిని విచారణ కోసం తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం ఎన్ఐఏ అధికారులను చుట్టుముట్టి ఆ వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎన్ఐఏ అధికారుల బృందం ప్రయాణిస్తున్న కారుపై ఇటుకలు, రాళ్లు విసిరినట్లు వారు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఎన్ఐఏ అధికారులు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.. మరోవైపు టీఎంసీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. మమతా హయాంలో బెంగాల్లో శాంతిభద్రతలు పూర్తిగా నాశనమయ్యాయని, పోలీసుల అండతోనే ఇదంతా జరుగుతున్నట్టు ఆరోపణలు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com