CBI On Tejaswi Yadav : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పై సీబీఐ రైడ్..
CBI On Tejaswi Yadav : ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అరెస్టుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది..! 'ల్యాండ్ ఫర్ జాబ్స్' కుంభకోణంలో అతని పాత్రపై ఆధారాలు సేకరించే పనిలో పడింది సీబీఐ. 2004-09 మధ్య లాలూప్రసాద్ యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో జరిగిన గ్రూప్-డి రైల్వే ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ గుర్తించింది. లాలూ కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో భూములు గిఫ్ట్డీడ్ రాయించుకుని.. కొలువులు ఇచ్చారనే అభియోగాలున్నాయి.
అయితే ఈ కేసులో సరైన ఆధారాలు లభిస్తే ఇది అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా ఉంటుందని చెబుతోంది సీబీఐ. యాదవ్లు తమ బంధుమిత్రుల పేరిట ఈ భూములు స్వాధీనం చేసుకున్నారని, తర్వాత భూమిని సొంతం చేసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఈ కుంభకోణం విలువ వందల కోట్ల రూపాయల్లో ఉండే అవకాశాలున్నాయని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి.
గత నెల లాలూప్రసాద్ యాదవ్, అతని కూతుళ్ల ఇళ్లలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు లాలూ ఇంటి నుంచి ఓ హార్డ్డిస్క స్వాధీనం చేసుకున్నారు. దాన్ని విశ్లేషించగా.. 'ల్యాండ్ ఫర్ జాబ్స్' స్కామ్లో సుమారు 1,458 మందికి ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్, హాజీపూర్ రైల్వే జోన్లలో కొలువులు ఇప్పించినట్లు అనుమానిస్తున్నారు. ఈ చిట్టాను తయారు చేసింది తేజస్వీ అని సీబీఐ వర్గాలు గుర్తించాయి. దీంతో.. నేడోరేపో తేజస్వీ అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ కేసులో ఈ ఏడాది మే 18న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. లాలూ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అతనికి ఓఎస్డీగా సేవలందించిన భోలా యాదవ్ను తొలుత ఈ కేసులో అరెస్టు చేశారు. అతడి వాంగ్మూలం మేరకు గత నెలలో లాలూ, ఆయన కూతుళ్లు మీసా భారతి, హేమాయాదవ్ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చి. వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఆ సమయంలో దొరికిన ఆధారాలతో 16 మంది అడ్డదారిలో కొలువులు సంపాదించిన వారిని సీబీఐ గుర్తించింది. మిగిలిన 1,442 మందిని విచారించాల్సి ఉంది. ఈ చిట్టాను రైల్వే శాఖకు పంపి.. ఆ జాబితాలో ఉన్నవారి వివరాలను సేకరించి ఆ తర్వాత వాళ్లని విచారిస్తామని సీబీఐ వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com