UGC-NET Paper Leak: యూజీసీ-నెట్ పేపర్ లీక్పై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై దాడి..

యూజీసీ-నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కేసులో విచారణకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై బీహార్లో దాడి జరిగినట్టు తెలుస్తున్నది. కేంద్ర విద్యా శాఖ ప్రతిపాదన మేరకు గురువారం యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు శనివారం సాయంత్రం బీహార్లోని నవాడా సమీపంలో ఉన్న కసియాదేహ్ గ్రామానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు స్థానికులు సీబీఐ వాహనాల చుట్టూ గుమిగూడి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సీబీఐ అధికారులు స్థానిక రాజౌలి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి స్థానికులను అడ్డుకున్నారు. ప్రభుత్వ పనికి అడ్డంకులు కల్పించడం, దాడి చేయడం వంటి ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.
నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీకులు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షల్ని రద్దు చేసింది. ఈ కేసును ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారిస్తుంది. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే కేసు దర్యాప్తు కోసం వెళ్లిన సీబీఐ అధికారులపై దాడి జరిగింది. బీహార్లోని నవడా జల్లాలోని గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అయితే, నకిలీ అధికారులని భావించి గ్రామస్తులు దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపుగా 200 మందిపై కేసులు నమోదు చేశారు.
దాడిని సెల్ఫోన్లో రికార్డ్ చేశామని, వీడియోల ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తుల్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నలుగురిని అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు సీనియర్ అధికారి అంబరీష్ రాహుల్ మాట్లాడుతూ, దాడి జరిగినప్పుడు సీబీఐ టీమ్ కసియాదిహ్ గ్రామంలో ఉందని తెలిపారు. స్థానిక పోలీసులు అధికారుల్ని రక్షించారు. టీమ్లోని నలుగురు అధికారులు, ఒక మహిళా కానిస్టేబుల్ ఒక వ్యక్తి సెల్ఫోన్ ట్రాక్ చేస్తూ ఆ గ్రామానికి వెళ్లారు. అయితే, వారిని గ్రామస్తులు నకిలీ అధికారులని కొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఊహించని దాడితో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసుల సమక్షంలో ఈ బృందం విచారణ చేపట్టింది. లొకేషన్ ఆధారంగా రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com