Boiled Rice: బాయిల్డ్ రైస్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

బాయిల్డ్ రైస్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి రాగా.. ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని తెలిపింది.అయితే లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డరు జారీ కానప్పటికీ ఇప్పటికే కస్టమ్స్ పోర్టుల్లో లోడ్ చేసి ఉంచిన బాయిల్డ్ రైస్కి ఈ సుంకం వర్తించదని ఆర్థిక శాఖ తెలిపింది. దీంతో పాటు లెటర్ ఆఫ్ క్రెడిట్ ఉన్న ఎగుమతులకు కూడా సుంకం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఇటీవల బాస్మతి బియ్యం కాకుండా ఇతర ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేయడంతో బాయిల్డ్ రైస్కు డిమాండ్ పెరిగింది.దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్న బాయిల్డ్ రైస్ నిల్వలను డిమాండ్ మేరకు అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది. మన దేశ బియ్యం ఎగుమతుల్లో బాస్మతి కాకుండా ఇతర తెల్ల బియ్యం వాటా 25 శాతం. గతంలో బియ్యం నూకలపైనా నిషేధం విధించారు. ఇప్పుడు ఉప్పుడు బియ్యం ఎగుమతులపైనా సుంకం అమలు చేయడంతో.. అన్నిరకాల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది కేంద్రం.
మరోవైపు దేశ రిటైల్ మార్కెట్లో ఏడాది వ్యవధిలో బియ్యం ధరలు దాదాపు 12 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 16 లక్షల టన్నుల బియ్యం మన దేశం నుంచి ఎగుమతి చేశారు.గత ఏడాది ఇదే సమయంలో ఈ ఎగుమతులు 11.55 లక్షల టన్నులు మాత్రమే. ఎగుమతులు విపరీతంగా పెరగడంతో బియ్యం నిల్వలు తగ్గి దేశ వ్యాప్తంగా ధరలు పెరగడంతో కేంద్రం కొన్ని రకాల బియ్యంపై నిషేధం విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com