లోన్లు, ఈఎంఐలు ఉన్నవారికి కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్..

లోన్లు, ఈఎంఐలు ఉన్నవారికి కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంలో సామాన్యులు కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల వరకు మారటోరియం గడువు పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్టు సుప్రీం కోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. కేంద్రం, ఆర్బీఐ తరఫున ఆయన వాదనలు వినిపించారు. మారటోరియంపై దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈఎంఐలపై అదనపు వడ్డీ విధించొద్దని పేర్కొంది. చెల్లించని ఈఎంఐలపైనా పెనాల్టీ విధించొద్దని ఆదేశించింది. ఇవాళ పూర్తిస్థాయిలో వాదనలు వింటామని తెలిపింది. పిటిషన్ విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.
కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నెల నుంచి లోన్లపై మారటోరియం విధించారు. మార్చి నుంచి ఆగష్టు వరకు మారటోరియం కొనసాగించారు. సెప్టెంబర్ నుంచి మారటోరియం ఎత్తివేయడంతో తిరిగి లోన్ల ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కరోనా కారణంగా లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగావకాశాలు కోల్పోయారు. తీసుకున్న లోన్లకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు తలెత్తాయి.
మారటోరియం సమయంలో కట్టాల్సిన ఈఎంఐ లపై వడ్డీని బ్యాంకులు వసూలు చేసేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో సుప్రీం కోర్టు లోన్లపై వడ్డీ విషయంలో కేంద్రాన్ని వివరణ కోరింది. దీనిపై కేంద్రం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 2020 నుంచి లోన్లపై మారటోరియం ప్రారంభం అయ్యింది. దీనిని మార్చి 2021 వరకు కొనసాగిస్తామని కేంద్రం తెలిపింది. రెండేళ్ల మారటోరియంపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com