Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు పాల్పడితే 10 ఏళ్ల జైలు

Anti Paper Leak Law: పేపర్‌ లీక్‌కు పాల్పడితే 10 ఏళ్ల జైలు
X
రూ.కోటి జరిమానా..

నీట్‌, యూజీసీ నెట్‌ పేపర్‌ లీకులపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, పరీక్షల్లో అక్రమాల కట్టడికి ఉద్దేశించిన చట్టాన్ని కేంద్రప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నిరోధక) చట్టం-2024కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు నెలల కిందటే ఆమోదముద్ర వేయగా, కేంద్రం తాజాగా చట్ట నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నెల 21 నుంచే ఈ చట్టం అమల్లోకి రానున్నది. దీని ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలు పాల్పడితే గరిష్ఠంగా పదేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల హడావుడి స్టార్ట్ కావడంతో అమలు తేదీని వెల్లడించలేదు.. గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను క్వశ్చన్ చేయగా.. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోంది, త్వరలో నోటిఫై చేస్తామన్నారు.

నెట్‌, యూజీసీ పేపర్‌ లీకుల నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రశ్నించిన మరుసటి రోజే దీనిపై నోటిఫికేషన్‌ వెలువడటం గమనార్హం. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024ను లోక్‌సభ ఫిబ్రవరి 6న ఆమోదించగా, 9న రాజ్యసభ ఆమోదించింది. అదే నెల 12న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, రైల్వేస్‌, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామ్స్‌, ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

. ఈ చట్టం ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను కొనుగోలు చేసినా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, పరీక్ష రాసే వారికి సాయం చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా లెక్కిస్తారు. ఇందుకు కారణమైన వారు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్షతో పాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించడానికి అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు నిరూపితమైతే వారి ఆస్తులనూ జప్తు చేయనున్నారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వసూలు చేయనున్నారు. ఇక, నుంచి పేపర్‌ లీకేజీ కేసులను ఈ చట్టం కింద నమోదు చేస్తారు.

Tags

Next Story