CHANDRAYAN-3: జులై 13న చంద్రయాన్‌-3 ప్రయోగం

CHANDRAYAN-3: జులై 13న చంద్రయాన్‌-3 ప్రయోగం
చంద్రయాన్‌-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారు... జులై 13 నుంచి 19 మధ్యకాలం సరైందన్న ఇస్రో ఛైర్మన్‌... విజయవంతం చేస్తామని విశ్వాసం...

జాబిల్లి అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ISRO ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. జులై 13న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ అధికారికంగా వెల్లడించారు. జులై 13 న ఫస్ట్ డేట్‌గా చెప్పిన ఇస్రో అప్పటి నుంచి 19వరకూ సరైన టైమ్ చూసి చంద్రయాన్ 3 ని ప్రయోగిస్తామని స్పష్టం చేసింది. జులై 13 నుంచి 19 వరకు లాంఛ్‌ విండో అందుబాటులో ఉంటుందని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు. ఈసారి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌లాండింగ్‌లో విజయవంతమవుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి రోజే ప్రయోగం చేపట్టాలని భావిస్తున్నామని.. కానీ సరైన టైమ్ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సోమనాథ్‌ తెలిపారు.


చంద్రయాన్‌ సిరీస్‌లో ఇది మూడో ప్రయోగం. GSLV M-3 భారీ వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యేలా దీన్ని చేపట్టనున్నారు. ల్యాండర్‌-రోవర్‌ కాంబినేషన్‌తో దీన్ని ప్రయోగించనున్నారు. ఇప్పటికే చంద్రయాన్‌ 2లో ప్రయోగించిన ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. అదే ఆర్బిటర్‌ను చంద్రయాన్‌ 3కి వినియోగించుకోనున్నారు.


ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్‌ చేయగలిగాయి. ఈ మైలురాయిని సాధించిన నాలుగో దేశంగా అవతరించాలని భారత్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా 2019లో చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ సమయంలో విఫలమైంది. అయినప్పటికీ ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన ఆర్బిటర్‌ మాత్రం ఇంకా కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. అంతకుముందు.. 2008లో ల్యాండర్‌ లేకుండా ఆర్బిటర్‌, ఇంపాక్టర్‌తో చంద్రయాన్‌-1 చేపట్టిన ప్రయోగం విజయవంతంగా జాబిల్లి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. అయితే, అది రెండేళ్లపాటు పనిచేసే విధంగా రూపొందించినప్పటికీ దాదాపు ఏడాదిలోనే దాంతో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 3వందల 12 రోజులు సేవలు అందించిన తర్వాత ఆ మిషన్‌ ముగిసినట్లు ఆగస్టు 2009లో ఇస్రో ప్రకటించింది. తాజాగా చేపడుతోన్న చంద్రయాన్‌ 3 ఈ మిషన్‌ విజయవంతమైతే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయి కానుంది.


చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్ ను దింపి రోవర్ ను నడిపించాలని లక్ష్యంతో చంద్రయాన్‌ 2ను గతంలో చేపట్టారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రయాన్ 2 రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు. ప్రశాంతంగా దిగాల్సిన ల్యాండర్ అనుకోని అవాంతరాలతో చంద్రుడిపైన కూలిపోయింది. అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ఆ వైఫల్యంతో చెప్పలేని వేదన అనుభవించారు. ప్రధాని మోదీ ఓదారుస్తుంటే శివన్‌ చంటిపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story