Char Dham : చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు ఆమోదం

చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను పునఃప్రారంభించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆమోదం తెలిపింది. మాన్సూన్ విరామం అనంతరం ఈ సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. యాత్రలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విమానయాన శాఖ స్పష్టం చేసింది.
భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కేంద్రం హెచ్చరించింది. ఇందుకోసం డీజీసీఏ, ఏఎయ్ఐ, రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ (UCADA) మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు డీజీసీఏ బృందం హెలిపాడ్లు, హెలికాప్టర్లు, ఆపరేటర్లపై సమగ్ర తనిఖీలు జరిపింది. అనంతరం భద్రతా ప్రమాణాలు పాటించాలనే నిబంధనలతో అనుమతులు మంజూరు చేసింది.
పైలట్లకు ప్రత్యేకంగా హై–ఆల్టిట్యూడ్ ఆపరేషన్ శిక్షణ ఇవ్వబడింది. భద్రతా సూచనలపై అన్ని హెలికాప్టర్ ఆపరేటర్లు, పైలట్లకు డీజీసీఏ ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించింది.
డెహ్రాడూన్ (సహస్త్రధారా) నుంచి యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రీనాథ్ ఆలయాలకు చార్టర్ సర్వీసులు నడుస్తాయి. గుప్తకాశి–ఫాటా–సితాపూర్ క్లస్టర్ నుంచి కేదార్కు shuttle సేవలు అందించనున్నారు. మొత్తం ఆరుగురు ఆపరేటర్లు shuttle సేవలు, ఏడుగురు ఆపరేటర్లు చార్టర్ సర్వీసులు నిర్వహించనున్నారు.
డీజీసీఏ మార్గదర్శకాల ప్రకారం పైలట్లకు రూట్ చెక్స్, పునరావృత శిక్షణ తప్పనిసరి. బరువు, సంతులనం పరిమితులు కఠినంగా అమలు చేయాలి. అదనంగా హెలిపాడ్ల వద్ద గ్రౌండ్ సిబ్బంది పెంచి, ప్రయాణికులకు భద్రతా సూచనలు అందించనున్నారు.
వాతావరణంపై రియల్ టైమ్ అప్డేట్స్ అందించేందుకు ప్రత్యేక సిస్టమ్ అమలు చేస్తున్నారు. మే–జూన్ 2025లో చోటుచేసుకున్న హెలికాప్టర్ ప్రమాదాల తర్వాత ఈసారి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
“యాత్రలో భద్రతకే అత్యధిక ప్రాధాన్యం. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణ భద్రత విషయంలో రాజీ పడబోం అని డీజీసీఏ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com