Chhattisgarh: మ్యాజిక్ ఫిగర్ ను మించిన బీజేపీ..

Chhattisgarh: మ్యాజిక్ ఫిగర్ ను మించిన బీజేపీ..
46 శాతానికిపైగా ఓట్లు

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లో భాజపా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డుస్థాయిలో 46 శాతానికిపైగా ఓట్లను దక్కించుకుంది. సీఎం భూపేశ్‌ బఘేల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ. ఓటర్లు మాత్రం కాషాయ పార్టీకే స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాల్లో 54 స్థానాలను భాజపా సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ 36 స్థానాలకు పరిమితమైంది. ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయభేరి మోగించింది. ఆ రాష్ట్రంలో ఉన్న 90 స్థానాల్లో 54 స్థానాలను సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ 36 చోట్ల విజయం సాధించింది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భాజపా పాలనకు 2018లో తెరదించి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా ఈసారి మళ్లీ భాజపా సీఎం పీఠాన్ని చేజిక్కించుకుంది. మాజీ సీఎం, భాజపా అభ్యర్థి రమణ్‌సింగ్‌ రాజ్‌నంద్‌గావ్‌లో భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్ భాజపా అధ్యక్షుడు అరుణ్‌ సావో....లోర్మీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ముఖ్యమంత్రి భుపేశ్‌ బఘేల్‌ పటాన్‌ నుంచి విజయం సాధించారు. ఐతే కాంగ్రెస్‌ సర్కారులో పలువురు మంత్రులు ఓటమిపాలయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో కమలదళం 46 శాతానికిపైగా ఓట్లు సాధించింది. 2000 నుంచి ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఈ స్థాయిలో భాజపాకు ఓట్లు రావడం ఇదే మొదటిసారి. భాజపా విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మ‌హ‌దేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కాంగ్రెస్ కొంప‌ముంచింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నిక‌ల బహిరంగ సభల్లోనూ ఈ కుంభకోణాన్ని ప్రస్తావించిన ప్రధాని న‌రేంద్ర మోదీ భూపేశ్‌ బ‌ఘేల్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింద‌ని ఆరోపించారు. కాంగ్రెస్‌పై అవినీతి, నిరుద్యోగం వంటి అస్త్రాలతో బరిలోకి దిగి భాజపా సఫలీకృతమైంది. మోదీ ఛరిష్మాను ఉపయోగించుకుంటూ.. మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాల ద్వారా రైతులు, మహిళా ఓటర్లను భాజపా తమ వైపు తిప్పుకోగలిగింది. మెుత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 స్థానాలకు నవంబరు 07న, మిగిలిన 70 స్థానాలకు నవంబరు 17న ఓటింగ్ జరిగింది.

Tags

Next Story