Chhattisgarh High Court : ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం క్రూరత్వమే: హైకోర్టు సంచలనం

వైవాహిక బంధంలో ఆత్మహత్య చేసుకుంటానని తరచూ బెదిరించడం, మతం మారమని ఒత్తిడి చేయడం వంటివన్నీ మానసిక క్రూరత్వం కిందకే వస్తాయని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కారణాలను చూపిస్తూ.. భార్య నుంచి భర్త విడాకులు కూడా తీసుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఇలాంటి ఓ కేసులో భార్య నుంచి భర్తకు విడాకులు మంజూరు చేస్తూ బలోడ్ జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
బలోడా జిల్లాకు చెందిన ఓ అమ్మాయి, అబ్బాయికి 2018 మే నెలలో వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలే ఈ పెళ్లి చేశారు. అయితే వీరి ప్రేమకు గుర్తుగా ఏడాది తిరిగిలోపే ఓ బాబు పుట్టాడు. అయితే ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో 2019 నవంబర్ నుంచి వీరు విడిగా జీవిస్తున్నారు. ముఖ్యంగా భార్య పుట్టింటి వద్దే ఉంటోంది. దీంతో భార్యను తనతో తీసుకెళ్లేందుకు భర్త చాలానే ప్రయత్నించాడు. గ్రామ పెద్దలు కూడా వీరిని కలపాలని చూశారు. కానీ అవేవీ కుదరలేదు. దీంతో భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఈక్రమంలోనే బలోడ్ ఫ్యామిలీ కోర్టు 2024 జూన్లో విడాకులు మంజూరు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ రజనీ దుబే, జస్టిస్ అమితేంద్ర కిషోర్ ప్రసాద్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించింది. క్రూరత్వం అంటే కేవలం భౌతిక హాని వరకు మాత్రమే పరిమితం కాదని.. భాగస్వామి మనసులో సహేతుకమైన భయాన్ని కలిగించే ప్రవర్తన కూడా హింస కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. భర్త గుర్రుర్ పోలీస్ స్టేషన్లో 2019 అక్టోబర్ 14న దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు ప్రస్తావించింది.
భార్య ప్రవర్తన వల్ల తాను నిరంతరం భయంతో జీవించాల్సి వచ్చిందని భర్త కోర్టుకు తెలిపాడు. ముఖ్యంగా భార్య తరచుగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడమే కాకుండా విషం తీసుకోవడానికి, కత్తితో పొడుచుకోవడానికి, కిరోసిన్ పోసి నిప్పు అంటించుకోవడానికి కూడా ప్రయత్నించిందని చెప్పాడు. ఇవన్నీ విన్న న్యాయస్థానం.. "భార్య పునరావృత ఆత్మహత్య ప్రయత్నాలు, బెదిరింపులు భర్తకు నిరంతర మానసిక వేధింపుల పరిస్థితిని సృష్టించాయి. ఇలాంటి ప్రవర్తన చట్టపరమైన క్రూరత్వ పరీక్షను సంతృప్తి పరుస్తుంది" అని బెంచ్ అభిప్రాయపడింది.
ఇది మాత్రమే కాకుండా భర్త ఇస్లాం మతాన్ని స్వీకరించాలని.. అతడి భార్య, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ఒత్తిడి చేశారని సామాజిక ప్రతినిధి వాంగ్మూలాన్ని కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ ఆరోపణను భార్య ఖండించినప్పటికీ.. సాక్ష్యం బలంగా ఉండడంతో కోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకునే తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అలాగే ఆమెకు ఇప్పటికే ఓ బిడ్డ ఉండగా.. ఆమెకు రూ.2 వేలు, మైనర్ బిడ్డ కోసం రూ.2 వేలు చొప్పున భరణం చెల్లించాలని కోర్టు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

