Maharashtra: ఆమె రీల్స్ చేస్తూ ఉంటే మతాన్ని ఎలా కాపాడగలం?

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బుధవారం నాగ్పూర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచార ర్యాలీలో కన్హయ్య ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రంలో ఓట్ జిహాద్కు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్మ యుద్ధంగా పోలుస్తూ ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు కన్హయ్య కౌంటర్ ఇచ్చారు. ‘మతాన్ని కాపాడే బాధ్యత మనది.. వారి పిల్లలు మాత్రం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదువుతారు. డిప్యూటీ సీఎం భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం సరికాదు. మతాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసి కాపాడుకుందాం.’ అంటూ కన్హయ్య వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ‘మహారాష్ట్ర ఆడబిడ్డను అవమానించేందుకు మీకెంత ధైర్యం? ఈ వ్యాఖ్యలు ప్రతీ మరాఠీ మహిళకు అవమానం’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
నాగ్పూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమృతా ఫడ్నవీస్ పేరును నేరుగా ప్రస్తావించకుండా కన్హయ్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్పూర్ సౌత్వెస్ట్ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ చేస్తున్నారు. ఇదే సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రఫుల్ల గూడాఢే బరిలో ఉన్నారు. రాజకీయ నాయకుల పిల్లలు విదేశాల్లో చదువుకుంటుంటే సాధారణ ప్రజలు మాత్రమే ఎందుకు మతాన్ని రక్షించుకోవాలో చెప్పాలంటూ కన్హయ్య కుమార్.. బీజేపీ నేతలను ప్రశ్నించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృత ఫడ్నవీస్ను ఉద్దేశించి పేర్లు ప్రస్తావించకుండానే పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విభజన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
"ఇది ధర్మ యుద్ధమే అయితే మీకు ప్రసంగాలు ఇస్తున్న నాయకులను ఒక మాట అడగండి.. ఈ యుద్ధంలో నాయకుల పిల్లలు కూడా పాల్గొంటారా అని.. వాళ్లేమో విదేశాల్లో చదువుకుంటుంటే మనం మతాన్ని రక్షించుకోవాలా?" అని నిలదీశారు. ఇక డిప్యూటీ సీఎం భార్య ఒకరు.. క్లాసికల్ డ్యాన్సర్, బ్యాంకర్ కూడా. ఆమె ఇన్స్ట్రాగ్రామ్లో రీల్స్తో బిజీగా ఉంటుందా అని కన్హయ్య కుమార్ ప్రశ్నలు గుప్పించారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కుమారుడు జై షా పైనా కన్హయ్య కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. మరి ఐసీసీ ఛైర్పర్సన్గా ఉన్న అమిత్ షా కుమారుడు కూడా ఈ మతాన్ని రక్షించుకునే పోరాటంలో పాల్గొంటారా అని ప్రశ్నించారు. క్రికెట్లో డ్రీం 11 జట్టును తయారు చేయాలని వారు చెప్తుంటారు. మనం మాత్రం ఎప్పటికీ జూదగాళ్లలాగానే మిగిలిపోతున్నాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com