భారతీయుల వ్యక్తిగత వివరాలు లీక్

భారతీయుల వ్యక్తిగత వివరాలు లీక్
X
ఎంచక్కా ఆ ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి పేరు, ఇంటి అడ్రస్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ కార్డు నంబర్, ఓటర్ ఐడీ నంబర్, పాస్ పోర్ట్ నంబర్, వ్యాక్సిన్ కేంద్రం వివరాలన్నీ వచ్చేస్తున్నాయి

దేశ ప్రజలకి సంబంధించిన మరో కొత్త డేటా లీకేజ్ బయటకు వచ్చింది. వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ తదితర వివరాలన్ని టెలిగ్రామ్ లో ప్రత్యక్షం అయ్యాయి. ఇంత ఇన్ఫర్మేషన్ అసలు ఎవరు, ఎవరికి ఇచ్చారో తెలుసా. మనమే చేజేతులా బయట పెట్టుకున్నాం. కరోనా వాక్సినేషన్ సమయంలో. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు కొవిన్ ప్లాట్ ఫామ్ లో నమోదు చేసేందుకు మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు బజారున పడ్డాయి. ఒక టెలిగ్రామ్‌ బాట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ లీకేజీ జరిగింది. వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఇచ్చిన ఫోన్ నంబర్ ను ఆ టెలిగ్రామ్‌ బాట్ లో ఎంటర్ చేయగానే సమస్త సమాచారం వస్తోంది.

ఎంచక్కా ఆ ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి పేరు, ఇంటి అడ్రస్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, పాన్ కార్డు నంబర్, ఓటర్ ఐడీ నంబర్, పాస్ పోర్ట్ నంబర్, వ్యాక్సిన్ కేంద్రం వివరాలన్నీ వచ్చేస్తున్నాయి.టీకా అందుబాటులో ఉన్నప్పుడు కొంతమంది ఒకే మొబైల్ నంబర్‌తో ఇతర కుటుంబ సభ్యుల కోసం కూడా స్లాట్‌లను బుక్ చేసుకునేవారు. ఇప్పుడు అలా ఒకే మొబైల్ నెంబర్ తో నమోదు అయిన చాలా మందివివరాలను టెలిగ్రామ్ ఒకేసారి చూపుతోంది.

లీకేజి విషయాన్ని ట్విట్టర్ లో ఉంచిన తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఆ ట్వీట్ కు స్క్రీన్ షాట్స్ కూడా జత చేశారు. వీటిలో కాంగ్రెస్‌ నేతలు జైరామ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, మాజీ హోం, ఆర్థిక మంత్రి పి చిదంబరం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉన్నారు. రాజేష్ భూషణ్ నంబర్‌ దగ్గర అతని ఆధార్ నంబర్, పుట్టిన తేదీ చివరి నాలుగు అక్షరాలతో పాటు, ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్ ఎమ్మెల్యే, అతని భార్య రీతూ ఖండూరి భూషణ్ వివరాలు కూడా బయటపడ్డాయి. అసలు కోవిన్ పోర్టల్లో ఉన్న వివరాలు టెలిగ్రామ్‌లో ఎలా లీక్ అయిందో ఇంకా తెలియరాలేదు. అయితే ఈ విధంగా డేటా లీక్ అయ్యింది అన్న సమాచారం బయటకు వచ్చిన అనంతరం చాట్ బ్యాక్ నిలిచిపోయింది.

సాధారణంగా కోవిన్ పోర్టల్ లో లాగిన్ అయినప్పుడు మొబైల్ కి వచ్చే ఓటిపిని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఈ సమాచారం కనిపిస్తుంది. అలాంటిది otp తో సంబంధం లేకుండా ఈ డేటా బయటకు రావడం ఆందోళన కలిగిస్తుంది. ఇది చాలా తీవ్రమైన అంశం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు మోదీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు అయితే దీని గురించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు.

Tags

Next Story