Hooch Tragedy: కల్తీ సారా ఘటనలో 58కి చేరిన మృతుల సంఖ్య..
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరణాల సంఖ్య 58కు చేరింది. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 110 మంది కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేపుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రొహిబిషన్ మంత్రి ఎస్. ముత్తుసామిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ను ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ దుర్ఘటన బాధితులను ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించలేదని బీజేపీ ప్రశ్నించింది. మరోవైపు.. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే సోమవారం నిరసన చేపట్టింది.
మరోవైపు.. కల్తీ సారా ఘటనలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాల్లోని పిల్లల విద్య, హాస్టల్ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ తెలిపారు. అలాగే.. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు వారికి 18 ఏండ్లు వచ్చేవరకూ నెలకు రూ. 5000 భృతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. పిల్లల పేరిట రూ. 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com