Rahul Gandhi: సుల్తాన్పూర్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ.. అమిత్ షాపై వ్యాఖ్యలు..

లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టుకు హాజరయ్యారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గాను పరువు నష్టం దావా వేశారు. తన స్టేట్మెంట్ను కోర్టులో నమోదు చేయడం కోసం ఆయన హాజరయ్యారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ఉదయం వచ్చి నేరుగా విచారణ కోసం సుల్తాన్పూర్ వెళ్లారు.
పరువు నష్టం కేసులో కోర్టు విచారణ కోసం రాహుల్ గాంధీ సుల్తానాబాద్ వచ్చారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ వెల్లడించారు. విచారణ కోసం వచ్చిన రాహుల్ గాంధీ, కోర్టు పని పూర్తి కాగానే ఢిల్లీకి తిరిగి వెళతారని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ కోర్టుకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సుల్తాన్పూర్లో 'సత్యమేవ జయతే' అంటూ రాసిన పోస్టర్లను ఏర్పాటు చేశారు.
2018 కర్ణాటక ఎన్నికల సమయంలో అమిత్ షాపై రాహుల్ గాంధీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు విజయ్ మిశ్రా పరువు నష్టం దావా వేశారు. 2024 జులై 26న కూడా రాహుల్ గాంధీ తన వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేశారు. తనపై రాజకీయ కుట్రలో భాగంగా పరువు నష్టం దావా వేశారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఆధారాలను సమర్పించాలని ఫిర్యాదుదారు విజయ్ మిశ్రాను కోర్టు నాడు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
