Arvind Kejriwal: ఈడీ విచారణ మరోసారి ఎగ్గొట్టిన కేజ్రీవాల్

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ విచారణకు సీఎ కేజ్రీవాల్ మరోసారి దూరంగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఆరోసారి సమన్లు పంపినప్పటికీ ఆయన స్పందించలేదు. ఫిబ్రవరి 19న (ఈరోజు) తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈ నెల 14న కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు పంపింది. ఈ సందర్భంగా ఆప్ స్పందిస్తూ.. కేజ్రీవాల్ కు ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని తెలిపారు. కేజ్రీవాల్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని... కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు పదేపదే సమన్లను పంపవద్దని, కోర్టు నిర్ణయం వెలువడేంత వరకు సంయమనం పాటించాలని కోరింది. కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని స్పష్టం చేసింది.
కాగా, ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న కేజ్రీవాల్.. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. సెంబ్లీలో బడ్జెట్ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా... మార్చి 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com