AAP: ఆప్ కు బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా

AAP: ఆప్ కు బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా
X
అంతర్గత కలహాలే కారణమని ఆరోపణలు... నేతల్లో అసంతృప్తి పెరిగిందని సంకేతాలు

ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ... ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్‌కు రాజీనామా చేశారు. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామాతో కేజ్రీవాల్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలినట్లైంది. ఈసారి పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఈ ఏడుగురు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పీఠం కోసం బీజేపీ-ఆప్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మరో ఐదు రోజుల్లో పోలింగ్ ముంచుకొస్తున్న తరుణంలో ఎమ్మెల్యేల రాజీనామా ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిందనే సంకేతాలకు తావిస్తోందని అంటున్నారు.

రాజీనామా చేసింది వీరే...

ఆప్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో భావనా గౌర్ (పాలం), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్‌లాల్ (కస్తూర్బా నగర్), రోహిత్ కుమార్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి), భూపిందర్ సింగ్ జూన్ (బిజ్వాసన్), నరేష్ యాదవ్ (హెహ్రౌలి) పవన్ కుమార్ శర్మ (ఆదర్శ్ నగర్) ఉన్నారు. నరేష్ యాదవ్ తొలుత తన రాజీనామాను ప్రకటించడంలో పార్టీలో అంతర్గత కలహాలు ముదిరినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం పార్టీకి గట్టిదెబ్బగా అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం అరవింద్ కేజ్రీవాల్‌‌కు గట్టి సవాలు కావచ్చని చెబుతున్నారు.

యమునా జలాల చుట్టూ ఢిల్లీ రాజకీయం

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలన్నీ యుమునా నది జలాల చుట్టూ తిరుగుతున్నాయి. యమునా జలాల్లో విషప్రయోగం జరిగిందంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ప్రధాని మోదీ ఈ విషయంపై ఘాటుగా స్పందించగా.. హర్యానా ముఖ్యమంత్రి యమునా నది వద్దకు వెళ్లి ఆ నీళ్లు తాగారు. ఈ వ్యాఖ్యలపై హర్యానా కోర్టు కేజ్రీవాల్‌కు నోటీసు కూడా జారీ చేయగా.. ఈసీ కూడా కేజ్రీవాల్ కు నోటీసులిచ్చింది.

హరియాణా సీఎం కుట్రలు: కేజ్రీవాల్‌

ఢిల్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి హరియాణా సీఎం తనపై కుట్ర చేస్తున్నారని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ‘జనవరి 15 తర్వాత నీటిలో అమ్మోనియం మోతాదు అధికమైనట్లు గుర్తించాం. దానికి మమ్మల్ని బాధ్యులను చేయాలని కుట్ర పన్నారు. మా పోరాటం వల్ల ఇప్పుడు నీటిలో అమ్మోనియం స్థాయిలు 2.1కు తగ్గాయి. దీన్నిబట్టి ఇందులో హరియాణా ప్రభుత్వ హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది’ అని కేజ్రీవాల్‌ ఆరోపణలు చేశారు.

Tags

Next Story