Indigo: ఇండిగో సంస్థకు డీజీసీఏ భారీ జరిమానా

Indigo: ఇండిగో సంస్థకు  డీజీసీఏ భారీ జరిమానా
X
గత డిసెంబర్‌లో వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కావడమే కారణం

ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.22.20 కోట్ల భారీ జరిమానా విధించింది. గత ఏడాది డిసెంబర్‌లో వేలాది విమానాలను రద్దు చేయడం, ఆలస్యం చేయడంతో దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనపై ఈ కఠిన చర్యలు తీసుకుంది.

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో డీజీసీఏ నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపింది. విమానాలు, సిబ్బందిని గరిష్టంగా వినియోగించుకోవడం (ఓవర్-ఆప్టిమైజేషన్), ప్రణాళిక సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, యాజమాన్య పర్యవేక్షణ కొరవడటం వంటివి ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా దర్యాప్తులో తేలింది. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇండిగో విఫలమైందని కమిటీ స్పష్టం చేసింది.

ఈ వైఫల్యాలకు గానూ డీజీసీఏ కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనల ఉల్లంఘనలకు ఒకేసారి రూ.1.80 కోట్లు, 68 రోజుల పాటు నిబంధనలు పాటించనందుకు రోజుకు రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.20.40 కోట్లు కలిపి రూ.22.20 కోట్ల జరిమానా విధించింది. దీంతో పాటు, 'ఇండిగో సిస్టమిక్ రిఫార్మ్ అష్యూరెన్స్ స్కీమ్' కింద రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలని ఆదేశించింది.

సంస్థ సీఈవో, సీఓఓలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది.

అయితే, ఇండిగో వేగంగా కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడాన్ని, రద్దయిన లేదా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైన విమానాల్లోని ప్రయాణికులకు రూ.10,000 విలువైన వోచర్లు అందించడాన్ని డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది.

Tags

Next Story