JNU: జెఎన్యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ధనంజయ్ ఎన్నిక
ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్యుఎస్యు) ఎన్నికల్లో వామపక్ష మద్దతు ఉన్న అఖిల భారతీయ విద్యార్థి సంఘం (AISA) క్లీన్ స్వీప్ చేసింది. JNUSU అధ్యక్షుడిగా ధనంజయ్ ఎన్నికయ్యారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఉమేష్ సి అజ్మీరాపై ఆయన గెలుపొందారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వామపక్ష మద్దతు ఉన్న విద్యార్థి సంఘం నుంచి దళితుడు అధ్యక్ష పదవిని దక్కించుకోవడం విశేషం.
ధనంజయ్ బీహార్లోని గయాకు చెందిన విద్యార్థి. జేఎన్యూలో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్(సౌందర్యశాస్త్రం)లో పీహెచ్డీ చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు తీసుకుంటున్న హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ (HEFA) రుణాల కారణంగా విద్యార్థులపై ఫీజుల భారాలు పెరిగిపోతున్నాయంటూ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ధనంజయ్ చేసిన ప్రసంగం విద్యార్థులను ఆకట్టుకుంది. క్యాంపస్లో నీరు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీలు కూడా ఇచ్చారు. మరోవైపు దేశద్రోహ ఆరోపణల కింద అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని ధనంజయ్ డిమాండ్ చేశారు. కాగా ధనంజయ్ కంటే ముందు 1996-97లో బట్టీ లాల్ బైర్వా జేఎన్యూ విద్యార్థుల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com