Raebareli:రాయ్బరేలీ బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్

కాంగ్రెస్కు కంచుకోట అయిన యూపీలోని రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ పేరును ఆ పార్టీ గురువారం ప్రకటించింది. కాంగ్రెస్కి కంచుకోటలుగా ఉన్న రాయ్బరేలీ, అమేథీకి అభ్యర్థులను ఇంకా ఆ పార్టీ ప్రకటించలేదు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, సోనియాగాంధీ ఇన్నాళ్లుగా పోటీ చేసిన రాయ్బరేలీలో బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ని నిలబెట్టింది. సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ తరుపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రియాంకాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
దినేష్ ప్రతాప్ సింగ్ బ్లాక్ లీడర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం యోగి సర్కార్లో మినిస్టర్గా ఉన్నారు. 2004లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2007లో బీఎస్పీ టికెట్పై తిలోయ్ నియోజకవర్గం నుంచి ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. 2010 నుంచి 2016 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2016 నుంచి 2022 వరకు మరోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నారు. 2022లో మూడో సారి గెలిచి యోగి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
2018లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన దినేష్ ప్రతాప్ సింగ్కు ఆ పార్టీ రాయ్బరేలీ నుంచి టికెట్ ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గట్టి పోటీ ఇచ్చినా గెలవలేకపోయారు. సోనియా గాంధీకి 55.80 శాతం ఓట్లు రాగా, దినేష్ సింగ్కు 38.36 శాతం ఓట్లు వచ్చాయి. సోనియా గాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీ నుంచి నిరంతరం ఎంపీగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com