రాహుల్తో సిద్ధరామయ్య, DKS భేటీ.. సీఎం సీటు ఎవరిని వరించేనో..

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే.. సోనియా గాంధీని, మరి కొంతమంది నేతలతో సమావేశమైన తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంది. మూడు రోజుల నిరీక్షణ తర్వాత, కర్నాటక తన తదుపరి ముఖ్యమంత్రిపై నిర్ణయం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఈ ఉత్కంఠకు తెరదించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే భావిస్తున్నారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) చీఫ్ డికె శివకుమార్, మాజీ సిఎం సిద్ధరామయ్యలలో సీఎం సీటు ఎవరిని వరించనుంది అనేది అంతటా ఆసక్తిగా మారింది.
సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సిఎం జి పరమేశ్వర్ తో సహా కాంగ్రెస్లోని ఇతరులు కూడా సీఎం కుర్చీ కోసం ఆశపడ్డారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కేంద్ర పరిశీలకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఇద్దరు ప్రధాన పోటీదారులు శివకుమార్, సిద్ధరామయ్యతో సహా పార్టీ నేతలతో ఖర్గే సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కేంద్ర నాయకత్వాన్ని కలవడానికి మంగళవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన తిరుగుబాటు లేదా రాజీనామా చేసే అవకాశం ఉందన్న వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో వాటన్నింటినీ తిప్పికొడుతూ, తాను హైకమాండ్కు అండగా ఉంటానని డీకే వెల్లడించారు.
మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది, 135 స్థానాలను కైవసం చేసుకుంది. కర్ణాటకలో ఏకైక అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) 66 సీట్లు గెలుచుకోగా, ప్రాంతీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లు గెలుచుకోగలిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com