Chandigarh: ఆక్సిజన్ సాయంతో .. అంబులెన్స్‌లో స్ట్రేచర్‌పై వచ్చి పరీక్ష రాసిన విద్యార్థిని

ఆక్సిజన్ సాయంతో 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసిన కనిష్క

చండీగఢ్‌కు చెందిన విద్యార్థి కనిష్కా బిష్త్‌ను తన అనారోగ్యం పరీక్ష రాయకుండా ఆపలేకపోయింది. ఐసీయూ నుంచి ఆక్సిజన్ సాయంతో అంబులెన్సులో పరీక్ష కేంద్రానికి వచ్చి 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసింది. ఆమెతో పాటు వైద్య సహాయకులు వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో 13 రోజుల పాటు ఉన్న కనిష్క ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

బాల్యం నుంచీ ఆరోగ్య సమస్యలున్న కనిష్క గత నెల రోజులకు పైగా తీవ్రమైన నిమోనియాతో పోరాడుతోంది. ఐసీయూలో ఉన్న ఆమెకు మూడు రోజుల క్రితం వెంటిలెటర్ తొలగించారు. ఇదే సమయంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు రావడంతో తాను రాస్తానని పట్టుబట్టింది. వైద్యులు, కుటుంబ సభ్యులు వారించినా వినలేదు. కష్టమైనప్పటికీ తాను అన్ని పరీక్షలు రాస్తానని తేల్చి చెప్పింది.

చండీగఢ్‌లోని మనీమాజారా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వచ్చి ఫిజిక్స్ పరీక్ష రాసింది. స్ట్రేచరుపై ఆమెను లోపలకు తీసుకువచ్చారు. కనిష్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ బోర్డు ఆమెకు గంట అదనపు సమయం ఇచ్చింది.

Tags

Next Story