Ugram: డీఆర్‌డీవో కొత్త రైఫిల్‌ ‘ఉగ్రం

Ugram:  డీఆర్‌డీవో కొత్త రైఫిల్‌ ‘ఉగ్రం
స్వదేశీ పరిజ్ఞానం.. 500 మీటర్ల రేంజ్‌.. భద్రతాబలగాలకు సరికొత్త రైఫిల్‌

స్వదేశీ పరిజ్ఞానంతో 'ఉగ్రం' పేరిట రూపొందించిన అధునాతన రైఫిల్‌ ప్రోటోటైప్‌ను డీఆర్‌డీవో ఆవిష్కరించింది. కదన రంగంలో శత్రువులకు వెన్నులో వణుకు పుట్టించే దేశీయ రైఫిల్‌ ‘ఉగ్రం’. డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ఆర్మమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏఆర్‌డీఈ) హైదరాబాద్‌కు చెందిన ద్వీపా ఆర్మర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో కలిసి 100 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఈ రైఫిల్‌ను అభివృద్ధి చేసింది.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చేసిన ఆయుధం ఇదే కావడం విశేషం. 7.2 ఎంఎం క్యాలిబర్‌ రౌండ్లను కలిగి ఉండే ఈ రైఫిల్‌ మన దేశంలో సాయుధ బలగాలు విరివిగా ఉపయోగించే ‘ఇన్సాస్‌’ రైఫిల్‌ కంటే ఎంతో భీకరమైనది. సైనిక, పారామిలిటరీ, పోలీసు బలగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ‘ఉగ్రం’ రైఫిల్‌ను అభివృద్ధి చేశారు. కార్గిల్‌ యుద్ధ సమయం నుంచి ఉపయోగిస్తున్న ‘ఇన్సాస్‌’ రైఫిళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. 4 కిలోల బరువు ఉండే ‘ఉగ్రం’ రైఫిల్‌ 500 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది.

ఇది దాదాపు 5 ఫుట్‌బాల్‌ మైదానాలంత దూరానికి సమానం. త్వరలో ఈ రైఫిల్‌ను ట్రయల్స్‌కు పంపనున్నట్టు ఏఆర్‌డీఈ డైరెక్టర్‌ అంకతి రాజు తెలిపారు. 7.62 ఎంఎం క్యాలిబర్‌ రౌండ్లను కలిగి ఉండే ఏకే-203 రైఫిళ్ల అభివృద్ధి కోసం భారత్‌ ఇప్పటికే రష్యాతో చేతులు కలిపింది. దీంతో ఈ రైఫిళ్లను దేశీయంగా తయారు చేసేందుకు ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఆర్‌పీఎల్‌) పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని కోర్వాలో ఓ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటైంది. దాదాపు 300 మీటర్ల రేంజిని కలిగి ఉండే ఏకే-203 రైఫిళ్లు ప్రస్తుతం తయారీ, పరీక్షల దశలో ఉన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story