Drugs: అది కాఫీపొడి కాదు డ్రగ్స్ .. ముంబై ఎయిర్ పోర్టులో మహిళ అరెస్ట్

ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ డ్రగ్స్ రాకెట్ను ఛేదించారు. కొలంబో నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి సుమారు రూ. 47 కోట్ల విలువైన 4.7 కిలోల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. కాఫీ ప్యాకెట్లలో అత్యంత చాకచక్యంగా దాచి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మహిళతో పాటు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిర్దిష్ట సమాచారం మేరకు, కొలంబో నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న మహిళను డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. ఆమె లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, కాఫీ ప్యాకెట్లలో దాచిన 9 పౌచ్లు బయటపడ్డాయి. వాటిని ప్రాథమికంగా పరీక్షించగా, అందులో ఉన్నది కొకైన్ అని నిర్ధారణ అయింది.
వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, ఈ డ్రగ్స్ తీసుకునేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి, ఈ రాకెట్కు ఫైనాన్స్, లాజిస్టిక్స్ సహకారం అందిస్తున్న మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. నిందితులందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు భారతీయ మహిళలను కొరియర్లుగా వాడుకుంటున్నాయని, ఆహార పదార్థాలలో డ్రగ్స్ దాచి రవాణా చేస్తూ కొత్త పంథాను ఎంచుకున్నాయని డీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. గత నెలలో ఢిల్లీలో కూడా డీఆర్ఐ భారీ ఆపరేషన్ నిర్వహించి, 26 మంది విదేశీయులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 108.81 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్, యాంఫెటమైన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్వర్క్పై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఐ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

