Mysore Dussehra : మైసూరు దసరా ఉత్సవాలకు వందల ఏళ్ల చరిత్ర..

Mysore Dussehra : దసరా సంబరాలకు మారుపేరు మైసూర్. విజయదశమి వేడుకలు అక్కడ కలర్ఫుల్గా జరుగుతున్నాయి. ఆయుధపూజను భక్తిశ్రద్దలతో నిర్వహించారు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్. భారత్లో దసరా పండుగ అంటే ప్రతి ఒక్కరికి మైసూర్ గుర్తుకొస్తుంది. ఈసారి కూడా మైసూర్లో దసరా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. దసరా సందర్భంగా మైసూర్ ప్యాలెస్లో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో చరిత్ర ఉంది.
దసరా సందర్భంగా తన పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలకు భక్తిశ్రద్దలతో పూజ చేశారు మైసూర్ మహారాజు. అశ్వాలను, గజరాజులను ఆయుధపూజలో భాగంగా అందంగా అలంకరించారు. మైసూర్ చాముండేశ్వరి అమ్మను కొలుస్తూ , భక్తికి సంస్కృతిని జోడిస్తూ శరన్నవరాత్రులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మైసూరు దసరా ఉత్సవాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు, పూజలు ఊరేగింపులు దేశ విదేశీయులను సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉత్సవాలు చూసేందుకు ప్రతీ ఏటా లక్షలాది మంది పర్యాటకులు మైసూర్ వస్తారు.
ఉత్సవాల్లో భాగంగా మైసూర్ ప్యాలెస్ దీప కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఇక్కడ దసరా ఉత్సవాలను 15వ శతాబ్దంలో విజయనగర రాజులు ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలలో కీలకమైనది జంబూ సవారీ. విజయదశమి రోజున జంబూ సవారీ నిర్వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com