EC : నీచమైన వ్యాఖ్యలపై ఈసీ కన్నెర్ర

EC : నీచమైన వ్యాఖ్యలపై ఈసీ కన్నెర్ర
కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్‌, భాజపా నేత దిలీప్‌ ఘోష్‌కు ఈసీ షోకాజ్‌ నోటీసులు

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ నేతలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్రజేసింది. కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్‌, భాజపా నేత దిలీప్‌ ఘోష్‌కు ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. వారి మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది. ప్రత్యర్థి పార్టీల నేతలపై అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్‌, భాజపా నేత దిలిప్‌ ఘోష్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టంచేసింది. వివరణ ఇవ్వకుంటే.. తప్పుగా పరిగణించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు భావిస్తామని తేల్చిచెప్పింది. ఇద్దరి వ్యాఖ్యలు మర్యాదరాహిత్యమైనవనీ, చెడు అభిరుచితో కూడుకుని ఉన్నాయని తెలిపింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై.. బర్దమాన్-దుర్గాపూర్ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి దిలీప్ ఘోష్‌ హేయమైన వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. బెంగాల్‌లో ఉన్నప్పుడు మమతా ఆ రాష్ట్ర కూతురిని అని చెప్పుకుంటారని వ్యాఖ్యానించారు. గోవాకు వెళ్తే ఆ రాష్ట్ర కూతురినని, త్రిపురలో త్రిపుర కుమార్తెనని చెప్పుకుంటారని అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళలపై ద్వేషం, అగౌరవభావం పెంచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. ఘోష్‌ వ్యాఖ్యలను భాజపా కూడా ఖండించింది. ఇలాంటి అన్‌పార్లమెంటరీ విధానాలకు భాజపా విరుద్ధమని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ ప్రవర్తనకు కారణాలను పార్టీకి వివరించాలని ఘోష్‌కు సూచించింది. ఈ క్రమంలో ఘోష్ పార్టీకి క్షమాపణలు చెప్పారు. పార్టీకి లేఖ ద్వారా అధికారిక సమాధానం ఇస్తానని తెలిపారు.

హరియాణాలోని మండి లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థిగా ఉన్న సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ నేత సుప్రియ శ్రీనేత్‌ ఇలాంటి వైఖరే ప్రదర్శించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంగనాను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన వ్యాఖ్యలతో శ్రీనేత్‌ పోస్టు పెట్టారని భాజపా తెలిపింది. అయితే సుప్రియా మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఇతరులు ఆ పోస్టు చేశారని వివరణ ఇచ్చారు. జాతీయ మహిళా కమిషన్ కూడా శ్రేనేత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యకు పాల్పడిన సుప్రియా శ్రీనేత్, గుజరాత్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ జాయింట్‌ కో-ఆర్డినేటర్‌పై చర్యలు తీసుకోవాలని NCW.. ఈసీని కోరింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన.. ఏ మాత్రం సహించరానిదని మండిపడింది. దీనిపై స్పందించిన కంగనా రనౌత్‌.. ఒక మహిళకు టికెట్‌ ఇస్తే వ్యక్తిత్వంపై దాడి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నటిగా అన్ని రకాల పాత్రలు పోషించానని, ఏ వృత్తిలో ఉన్నా ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలేనని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story