Eknath Shinde: ప్రమాణ స్వీకారం సందర్భంగా షిండే సొంత ప్రసంగం

మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మహాయుతి కూటమిని చివరివరకు టెన్షన్కు గురి చేసిన ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా దానిని కొనసాగించారు.
కాగా, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను ప్రారంభించారు. అయితే షిండే అక్కడున్న స్క్రిప్ట్ను చదవడానికి బదులు సొంతంగా ప్రసంగించారు. ‘నా గురువు ధర్మవీర్ ఆనంద్ దిఘేని స్మరించుకుంటూ హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేకు నా ప్రణామాలు. ప్రధాని మోదీ బలమైన నాయకత్వం, హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో, మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ఓటర్ల మద్దతుతో..’ అని మాట్లాడసాగారు. దీంతో వేదికపై ఉన్న మోదీ, అమిత్ షాతో సహా ముఖ్యనేతలు షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోయమం చెందారు.
మరోవైపు ఏక్నాథ్ షిండే ప్రసంగాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అడ్డుకున్నారు. ప్రమాణ స్వీకార ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తూ తిరిగి ‘నేను’ అని అన్నారు. దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా షిండే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే షిండే ప్రమాణ స్వీకారం చెల్లినప్పటికీ సంబంధిత ప్రోటోకాల్ను ఆయన పాటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com