Assembly Elections 2023: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఎన్నికల ప్రచారానికి తెర

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సహా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండవ విడత ఎన్నికల పోలింగ్కు ఇంక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. గత నెల రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచార సందడి నిన్న సాయంత్రం 6 గంటలకు నిలిచిపోయింది. నెల రోజుల పాటూ బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. ఇప్పుడు అభ్యర్థులు బహిరంగ ప్రచారం చేయకుండా ఇంటింటికి మాత్రమే ప్రచారం చేయగలుగుతారు.
దేశవ్యాప్తంగా ఈ నెలలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. విడతల వారీగా ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నవంబర్ 17వ తేదీన మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలతో పాటు ఛత్తీస్గఢ్లో 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో అక్కడ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్కు జరిగే 48 గంటల ముందు ప్రచారానికి గడువు ముగుస్తుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడటంతో మైకులు మూగబోయాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
మధ్యప్రదేశ్లో 5.6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 2.88 కోట్ల మంది ఉండగా.. 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 22.36 లక్షల మంది యువత కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఛత్తీస్గఢ్లో తొలి విడతగా 20 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 17న మిగిలిన 70 స్థానాలకు నిర్వహిస్తున్నారు. రెండో విడతలో 958 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. వీరిలో 827 మంది పురుషులు, 130 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1.63 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ కోసం ఇప్పటికే ఛత్తీస్గఢ్లో 18,883 పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది.
ఛత్తీస్గఢ్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 60 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో కేవలం 15 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకోగా.. జేసీసీ పార్టీ ఐదు, బీఎస్పీ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు అంచనా వేశాయి. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాల్లో గెలవగా.. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో.. బీఎస్పీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఏడాదికే కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అధికారాన్ని చేపట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com