Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో నవంబర్ 30న ఎన్నికలు
![Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో నవంబర్ 30న ఎన్నికలు Assembly Elections 2023 Schedule : ఐదు రాష్ట్రాల్లో నవంబర్ 30న ఎన్నికలు](https://www.tv5news.in/h-upload/2023/10/09/1087149-election-commission-094737979-16x9.webp)
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 30 న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్, మిజోరం రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ అధికారులు ఐదు రాష్ట్రాలలో పర్యటించారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారని వివరించారు.
ఎన్నికల నిర్వహణ కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించామని తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో మొత్తం 679 నియోజక వర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయని, వీటిల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని అన్నారు. మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నారని వివరించారు.ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నామని, అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఐదు రాష్ట్రాల్లో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. మిజోరంలో మొత్తం 8.52 లక్షల మంది ఓటర్లు, ఛత్తీస్గఢ్లో 2.03 కోట్ల మంది, మధ్య ప్రదేశ్లో 5.6 కోట్ల మంది, రాజస్థాన్లో 5.25 కోట్ల మంది, తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఛత్తీస్గఢ్ నవంబర్ 7, 17న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా మధ్యప్రదేశ్ - నవంబర్ 7న, రాజస్థాన్ లో నవంబర్ 23న తెలంగాణ నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com