Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ కీలక సూచన
దేశంలో మరి కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలో రాజకీయ నేతలు తమ ప్రసంగాలలో వాడి వేడి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. దీన్ని ఒక కంట కనిపెడుతున్న ఎలక్షన్ కమిషన్ పలు పార్టీలకు సూచనలు చేస్తూ ఉంది.ప్రసంగాలు చేస్తున్న సమయంలో నేతలు సంయమనం పాటించాలని సూచించింది. ఈ నేపధ్యంలో బహిరంగంగా మాట్లాడే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం సూచించింది.
ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన గతంలో పనౌతి (దురదృష్టవంతుడు), పిక్ పాకెట్ వంటి విమర్శలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ... రాహుల్ గాంధీకి సూచనలు చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎన్నికల ప్రచారంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరించాల్సిన తీరుపై జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని సూచించింది. గతేడాది నవంబర్లో రాహుల్ గాంధీ ప్రధానిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రచారంలో రాజకీయ నేతల ప్రసంగాలు హద్దుమీరుతున్న నేపథ్యంలో సంయమనం పాటించాలంటూ కోరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ‘పనౌటీ’ అనే పదాన్ని రాహుల్ గాంధీ ఉపయోగించారు. గతేడాది ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
జట్టు ఓటమిపై రాహుల్ స్పందించారు. మంగళవారం ప్రపంచకప్లో ఓడిపోవడానికి మోదీనే అంటూ పరోక్షంగా కారణమని వ్యాఖ్యానించారు. ‘మన అబ్బాయిలు దాదాపు ప్రపంచకప్ గెలుచుకున్నారు. ఓ చెడు శకునం (పనౌటి) ప్రవేశం వారిని ఓడిపోయేలా చేసింది’ అంటూ మోదీని ఉద్దేశిస్తూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్షా, అదానీలను జేబుదొంగలతో పోల్చారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్ 21న ఢిల్లీ హైకోర్టు... కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు అనుసరించాల్సిన అడ్వైజరీని చూసుకోవాలని రాహుల్ గాంధీకి ఈసీ సూచించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com