Social Media X: కొన్ని ‘ఎక్స్’ ఖాతాల నిలిపివేతకు కేంద్రం ఆదేశం

భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన ఖాతాలు, పోస్టులపై చర్యలు తీసుకోవాలని తమను ఆదేశించిన్లట్లు సామాజిక మాధ్యమ సంస్థ ఎక్స్ బుధవారం ఒక పోస్ట్లో ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ఖాతాలు పోస్టులను నిలిపివేశామని తెలిపింది. అయితే ప్రభుత్వం నిర్ణయంతో ఎక్స్ విభేదించింది. తమ వేదికపై ప్రతి ఒక్కరికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపింది. తమ విధానాలకు అనుగుణంగా భారత ప్రభుత్వ ఆదేశాలను సవాలుచేస్తూ రిట్ అప్పీలు దాఖలు చేసినట్లు ఎక్స్ పేర్కొంది.
ప్రస్తుతం అది పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది. ఖాతాలు నిలిపివేయడం వల్ల ప్రభావితమైన ఖాతాదారులకు నోటీసులు..అందించామని చెప్పింది. చట్టపరమైన పరిమితుల కారణంగా, ప్రభుత్వ ఆదేశాలను బహిర్గతం చేయలేకపోతున్నామని తెలిపింది. కానీ, పారదర్శకత కోసం వాటిని అందరిముందు ఉంచడం అవసరమని పేర్కొంది. లేదంటే జవాబుదారీతనం లోపిస్తుందని ఏకపక్ష నిర్ణయాలకు దారితీస్తుందని భావిస్తున్నట్లు ఎక్స్ తన గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్ ఖాతాలో చేసిన పోస్టులో వివరించింది. దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలకు సంబంధించిన 177 ఖాతాలను బ్లాక్ చేయాలని.... కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఎక్స్ను ఆదేశించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నదాతల ఆందోళనతో పంజాబ్-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ బుధవారం యుద్ధ భూమిని తలపించింది. చలో దిల్లీకి బయలుదేరిన కర్షకులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రువ్వడంలాంటి ఘటనలతో హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో తలకు గాయమై యువరైతు ప్రాణాలు వదిలాడు. పోలీసు కాల్పుల వల్లే తమ సహచరుడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించాయి. మరో ఇద్దరు రైతులూ గాయపడినట్లు తెలిపాయి. 12 మంది పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు ఎక్స్ ప్రకటించింది. ఎక్స్ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం నుంచి.. ఎలాంటి స్పందన రాలేదు. ఎక్స్లో ఎవరి ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించిందో కూడాఅధికారికంగా భారత ప్రభుత్వం వెల్లడించలేదు.
ప్రభుత్వ ఆదేశాలను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటీషన్ ఇంకా పెండింగ్లోనే ఉన్నట్లు ఎక్స్ చెప్పింది. తమ పాలసీ ప్రకారం నిషేధిత యూజర్లకు నోటీసులు ఇచ్చినట్లు కూడా ఎక్స్ వెల్లడించింది. న్యాయపరమైన అవరోధాలు ఉన్న కారణంగా.. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను పబ్లిష్ చేయడం లేదని ఎక్స్ తెలిపింది. కానీ పారదర్శకత ఉండాలంటే ఆ అంశాలను పబ్లిక్ చేయాల్సి ఉంటుందని, సమాచారాన్ని ఇవ్వకపోవడం బాధ్యతారాహిత్యం అవుతుందని, న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఎక్స్ తన ప్రకటనలో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com