KARUNA GOPAL: ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సభ్యురాలిగా కరుణా గోపాల్

ప్రముఖ ఆలోచనాకర్త, వక్త, మహిళలు, బాలికల సమస్యలపై పోరాడే నాయకురాలు, బీజేపీ నేత కరుణా గోపాల్ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(Endometriosis Foundation of India) సంస్థలో అడ్వైజరీ మెంబర్గా చేరారు. ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్( Foundation for Futuristic Cities) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కరుణాగోపాల్(Karuna Gopal ) ఉన్నారు.
దేశంలో మొదటిదైన ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థను.. హైదరాబాద్కు చెందిన డాక్టర్ విమీ బింద్రా స్థాపించారు. ఎండోమెట్రియోసిస్ రోగుల కోసం ఈ సంస్థను స్థాపించారు. ఎండోమెట్రియోసిస్తో బాధపడుతున్న రోగులకు అందుబాటులో ఉన్న వైద్య పరిష్కారాలను తీసుకురావడానికి ఈ సంస్థను ప్రారంభించారు. భాగస్వాములతో కలిసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, వైద్య సంస్థలను సమన్వయం చేస్తూ మహిళలకు ఎండోమెట్రియోసిస్పై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు.
ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలోకి కరుణా గోపాల్ని స్వాగతిస్తున్నామని డాక్టర్ విమీ బింద్రా( Dr. Vimee Bindra) తెలిపారు. కరుణా గోపాల్ సభ్యురాలిగా చేరడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆమె అనుభవం, నైపుణ్యం తమ సంస్థకు లాభిస్తుందని వెల్లడించారు. ప్రజా జీవితంలో మార్పు తీసుకురావాలనే కరుణా గోపాల్ నిబద్ధత తమకు సాయపడుతుందని మిమీ బింద్రా వెల్లడించారు.
ఎండోమెట్రియోసిస్ అంటే....
సాధారణంగా మహిళల గర్భకోశంలో పొరలా ఉండే కణజాలం.. నెలసరి సమయంలో బయటకు వెళ్లిపోతుంది. కానీ, ఇలా వెళ్లకుండా కటి భాగంలో, అండాశయంలో, ఫాలోపియన్ నాళాల్లోకి చేరి అక్కడే పెరిగితే ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య తలెత్తుతుంది. అంటే ఇతర భాగాల పనితీరుకు భంగం కలిగిస్తుందన్నమాట. ఫలితంగా తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, వ్యంధత్వం(ఇన్ఫర్టిలిటీ) వంటి లక్షణాలు ఏర్పడతాయి. అయితే, ఎండోమెట్రియోసిస్ ఉండి గర్భం దాల్చాలని భావించే వారు పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com