Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్గాంధీకి ఈడీ రెండోసారి సమన్లు..

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. గురువారం ఈడీ విచారణకు రాహుల్ హాజరు కాకపోవడంతో జూన్ 13న రావాలని తాజాగా నోటీసు ఇచ్చింది. అంతకుముందు ప్రస్తుతం తాను ఇండియాలో లేనని ఈనెల 3వ తేదీన రాలేనని ఈడీకి రాహుల్ తెలిపారు. విచారణకు మరింత సమయం కావాలని కోరారు. రాహుల్ గాంధీ అభ్యర్థనను స్వీకరించిన ఈడీ అధికారులు.. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని సమన్లు పంపింది.
సోనియాగాంధీ, రాహుల్గాంధీ భూకబ్జాలతో వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో నేషనల్ హెరాల్డ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. రాహుల్ డైరెక్టర్గా ఉన్న యంగ్ ఇండియా సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీలు కొనుగోలు చేశారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులోనే ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు. అయితే ఈనెల 8న సోనియాగాంధీ ఈడీ విచారణకు కచ్చితంగా హాజరవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద సోనియా, రాహుల్ వాంగ్మూలాలను రికార్డు చేస్తామని ఈడీ అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com