Exit Polls Vs Exact Results: బెడిసికొట్టిన ఎగ్జిట్ పోల్స్

Exit Polls Vs Exact Results: బెడిసికొట్టిన  ఎగ్జిట్ పోల్స్
X
పెద్ద రాష్ట్రాల్లో అంచనాలన్నీ ఫెయిల్​

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి దాదాపు అన్ని సర్వే సంస్థల అంచనాలు తారమారయ్యాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైన ఫలితాలకు వ్యత్యాసం భారీగా కనిపించింది. అన్ని సర్వే సంస్థలు ఎన్​డీఏ కూటమి విజయాన్ని ఊహించినప్పటికీ సీట్ల విషయంలో వాటి అంచనాలు బెడిసికొట్టాయి. ఎన్​డీఏ, ఇండియా కూటముల మధ్య స్వల్ప మార్పులు ఉంటాయని చెప్పడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. బీజేపీ కూటమి 300కు పైగా సీట్లను గెలుచుకుంటుందని అన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా, ఆ మార్కును సైతం అందుకోలేకపోయాయి.

'ఇండియాటుడే యాక్సిస్‌ మై ఇండియా' సర్వే సంస్థ అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమికి 361-401 సీట్లు వస్తాయని, ప్రతిపక్ష ఇండియా కూటమి 131-166 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. టైమ్స్‌ నౌ-ఈటీజీ రీసెర్చ్‌ తమ సర్వేలో ఎన్​డీఏకు 358, ఇండియా కూటమికి 152 సీట్లు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్‌ టీవీ పీ మార్క్‌ సైతం దాదాపు ఇదే సంఖ్యతో ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేసింది. 'టుడేస్‌ చాణక్య' సంస్థ ఎన్​డీఏకు 400 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 107 సీట్లు వస్తాయని చెప్పింది. జన్‌కీబాత్‌ తమ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి 390 సీట్లు, ప్రతిపక్ష కూటమికి 161 వస్తాయని పేర్కొంది. న్యూస్‌ నేషన్‌ సంస్థ ఎన్​డీఏకు 378, ఇండియా కూటమికి 169 సీట్లు వస్తాయని తెలిపింది. ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బంగాల్, రాజస్థాన్‌లలో ఓటర్ల ఆంతర్యం పసిగట్టడంలో సర్వే సంస్థలు బాగా బోల్తాపడ్డాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఏకపక్షం విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేయగా కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించి బీజేపీ దూకుడుకు కళ్లెం వేసింది.

ఎన్నికల ఫలితాల్లో రాజకీయ పార్టీల అంచనాలు తారుమారవ్వడమనేది ఇదే తొలిసారి కాదు. కొన్నిసార్లు దారుణంగా ఓడిన సందర్భాలూ ఉన్నాయి. గతేడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొన్ని చోట్ల ఎగ్జిట్​ పోల్స్ అంచనాలు లెక్క బెడిసికొట్టింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించగా, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కానీ, ఎగ్జిట్​ పోల్స్‌ మాత్రం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడతాయని అంచనా వేశాయి. మరోవైపు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలానే జరిగింది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు తెలిపాయి. కొన్ని సర్వేలు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

Tags

Next Story