Supreme Court: అలా మరణించిన ప్రైవేట్‌ వైద్యుల కుటుంబాలు పీఎంజీకేవైకి అర్హులే: సుప్రీం

Supreme Court:  అలా మరణించిన  ప్రైవేట్‌ వైద్యుల కుటుంబాలు పీఎంజీకేవైకి అర్హులే: సుప్రీం
X
కోవిడ్ విధుల్లోనే మరణించారని నిరూపించుకోవాల్సిన బాధ్యత క్లెయిమ్ దారులదేనని వెల్లడి

కోవిడ్-19 మహమ్మారి సమయంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రైవేట్ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కుటుంబాలకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50 లక్షల బీమా పథకం నుంచి వారిని మినహాయించలేరని సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది.

లాక్‌డౌన్ సమయంలోనూ తన క్లినిక్‌ను తెరిచి సేవలు అందిస్తూ జూన్ 2020లో కోవిడ్ కారణంగా మరణించిన ప్రైవేట్ వైద్యుడు డాక్టర్ బీఎస్ సుర్గాడే భార్య దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. డాక్టర్ సుర్గాడే సేవలను ప్రభుత్వం అధికారికంగా 'రిక్విజిషన్' (విధుల్లోకి తీసుకోవడం) చేయలేదన్న కారణంతో, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ (పీఎంజీకేవై) కింద ప్రయోజనాలు కల్పించాలన్న ఆమె అభ్యర్థనను గతంలో బాంబే హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అధికారిక నియామక పత్రాలు లేవనే అతి సాంకేతిక కారణాలతో వైద్యుల కుటుంబాలకు బీమా ప్రయోజనాలను నిరాకరించడం సరికాదని స్పష్టం చేసింది. "మహమ్మారి విజృంభించిన అసాధారణ పరిస్థితులను అర్థం చేసుకోవాలి తప్ప, వ్యక్తిగత నియామక ఉత్తర్వులను అడగడం సబబు కాదు" అని ధర్మాసనం అభిప్రాయపడింది.

ముందు వరుసలో నిలబడి పోరాడిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి దేశం అండగా ఉందని భరోసా ఇచ్చేందుకే ఈ బీమా పథకాన్ని ఉద్దేశించారని కోర్టు పేర్కొంది. అయితే, బీమా వర్తింపు అనేది కేసును బట్టి ఉంటుందని స్పష్టం చేసింది. మరణించిన వ్యక్తి కోవిడ్ సంబంధిత విధుల్లోనే ప్రాణాలు కోల్పోయాడని విశ్వసనీయమైన ఆధారాలతో నిరూపించుకోవాల్సిన బాధ్యత క్లెయిమ్ చేసేవారిపైనే ఉంటుందని తెలిపింది. ఈ విపత్కర సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలను ప్రశంసిస్తూ, వారిని 'అచంచలమైన వీరులు'గా అభివర్ణించింది.

Tags

Next Story