Farooq Abdullah: కాల్పులపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా..

Farooq Abdullah: కాల్పులపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా..
X
తాను ఎవరికీ అపకారం చేయలేదని, దాడికి కారణం తెలియదన్న ఫరూక్

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా తనపై జరిగిన హత్యాయత్నంపై తొలిసారిగా స్పందించారు. తాను జీవితంలో ఎవరికీ హాని చేయలేదని, తనపై ఎందుకు దాడికి ప్రయత్నించారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి పరామర్శించారని ఆయన తెలిపారు.

జమ్మూలోని తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ, "నా తలుపులు ఎప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయి. నన్ను కలవడానికి వచ్చే ప్రజల సమస్యలు విని, నాకు సాధ్యమైనంత సహాయం చేస్తాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరికీ అపకారం చేయలేదు" అని అన్నారు. పెళ్లి వేడుకలో జరిగిన ఘటనను వివరిస్తూ, "నా మెడ వెనుక ఏదో వేడిగా తగిలినట్టు అనిపించింది. మొదట టపాసుల శబ్దం అనుకున్నాను. కానీ, నా భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. వారు అతని చేతిని పక్కకు తోయడంతో తూటా గాల్లోకి దూసుకెళ్లింది. వారి వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను" అని తెలిపారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, ఎన్‌ఎస్‌జీ కమాండోలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ పదేపదే చెప్పడం మానుకోవాలని ఫరూక్ కోరారు. "దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతోంది. మేం స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉంది," అని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర హోదాపై మాట్లాడుతూ.. పార్లమెంటు, సుప్రీంకోర్టులో హామీ ఇచ్చినా ఏళ్లు గడుస్తున్నా అమలు కాలేదని విమర్శించారు. వేర్పాటువాద నేత షబ్బీర్ షాకు బెయిల్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Tags

Next Story