Fire Breaks Out : దీపావళి సంబరాల్లో అపశ్రుతి ..

Fire Breaks Out : దీపావళి సంబరాల్లో అపశ్రుతి ..
పలుచోట్ల అగ్నిప్రమాదాలు…

దీపావళి పండుగ సందర్భంగా అనేక అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకోవడంతో పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర బాణసంచా మార్కెటులో జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. గోపాల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో రెండు మోటారు సైకిళ్లు, 12 దుకాణాలు కాలిపోయాయి. దుకాణాలను మంటలు చుట్టుముట్టడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు వస్త్రాల దుకాణాలు దగ్ధమయ్యాయి. మహారాష్ట్రలోని శుక్రవార్ పేట ప్రాంతంలోని గోదాముల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం వల్ల ఆస్తినష్టం సంభవించింది. జమ్మూకశ్మీరులోని కుప్వారా జిల్లా మాతా శార్దాదేవి దేవాలయంలో అగ్నిప్రమాదం జరిగింది.

ఆలయంలో దీపావళి సందర్భంగా దీపాలు వెలగించి పూజలు చేస్తుండగా ఈ అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోనే దీపావళి సందర్భంగా వంద అగ్నిప్రమాదాలు జరిగాయి. ఆదివారం రాత్రి 6 గంటల నుంచి రాత్రి 10.45 గంటల వరకు 200 అగ్నిప్రమాదాలు జరగ్గా మంటలను సకాలంలో ఆర్పామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు.


ఇక మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం దీపావళి బోనస్ ఇవ్వడానికి నిరాకరించినందుకు దాబా యజమానిని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి బోనస్‌ను ఇవ్వడానికి యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీపంలోని ధాబా వద్ద అతని ఉద్యోగులు గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఛోటు, ఆదిగా గుర్తించారు. మృతుడు రాజు దేంగ్రేగా గుర్తించారు. దాదాపు నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్‌లోని లేబర్ కాంట్రాక్టర్ ద్వారా వీరిద్దరినీ రాజు ధెంగ్రే దాబాలో వర్కర్లుగా నియమించుకున్నాడని పోలీసులు తెలిపారు.

దీపావళి రోజున డబ్బు, బోనస్ కోసం డిన్నర్ చేస్తున్న సమయంలో ఆది, చోటూతో ధెంగ్రే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. రాజు ధెంగ్రే వారికి ఇంకేదైనా రోజు డబ్బు ఇవ్వడానికి అంగీకరించాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత, దేంగ్రే ఒక మంచం మీద నిద్రపోయాడు. అయితే అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో యజమానిని హతమార్చాలని కుట్ర పన్నిన నిందితులు.. అదేరోజు రాత్రి భోజనం అయ్యాక ధెంగ్రే నిద్రపోతున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజు ధెంగ్రే నిద్రపోతుండగా.. మెడకు తాడును బిగించి.. ఆపై మొద్దుబారిన వస్తువుతో అతని తలపై కొట్టారు. పదునైన ఆయుధంతో అతని ముఖంపై దాడి చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత ధెంగ్రే మృతదేహాన్ని ఓ బొంతలో కప్పి నిందితులిద్దరూ అతడి కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో విహార్‌ గావ్‌ సమీపంలోని నాగ్‌పూర్‌-ఉమ్రెడ్ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టగా.. నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. దీంతో కారు దిగి దిఘోరి వైపు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.


Tags

Read MoreRead Less
Next Story