Doctors Killed: అతి వేగం ఐదుగురు డాక్టర్లు సహా ఆరుగురి ప్రాణాలు తీసింది

ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు సైఫాయి మెడికల్ కాలేజీకి చెందినవారని, లక్నో నుంచి సైఫాయికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ తెల్లవారుజామున 3.43 గంటలకు జరిగిన ఈ ప్రమాదానికి గల అసలు కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్ను ఢీకొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయ్వీర్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. మృతిచెందిన వారిలో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్ర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నర్దేవ్ ఉన్నారు. లక్నోలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com