FLIGH CRASH: ఎటు చూసినా కన్నిటీ కథలే

FLIGH CRASH: ఎటు చూసినా కన్నిటీ కథలే
X
గుండెలు పిండే విషాదం..కుటుంబం మొత్తం మృతి

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దేశం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసింది. భారత విమానయాన చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన ఈ ఘోర ప్రమాదంలో... ఒక్కో కుటుంబం బాధలు వింటుంటే... అప్రయత్నంగానే కన్నీటి ధార కడుతోంది. తల్లిని పోగొట్టుకుని ఒకరు... గారాలపట్టిని పోగొట్టుకుని మరొకరు... భర్త దగ్గరికి వెళ్తూ ఇంకొకరు... తుది శ్వాస విడిచారు. కొన్ని క్షణాల్లోనే జరిగిన ఈ ప్రమాదం... ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని... జీవితాంత బాధను మిగిల్చింది. ప్రయాణంలో మరణించిన తమ వారి.. మృతదేహాలు కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉండడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన.. బంధువుల ఆక్రందన... స్నేహితుల రోదన మిన్నంటుతున్నాయి. కళ్ళ ముందే ఇంతటి విధ్వంసం చూసిన ప్రజల హృదయాలు ద్రవిస్తున్నాయి.

గుండెలు పిండే విషాదం..కుటుంబం మొత్తం మృతి

ఆహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఓ కుటుంబం మొత్తాన్ని అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలిగొంది. విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ మృతి చెందారు. వీరిని రాజస్థాన్‌లో బన్స్వారాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి ముందు ప్రతీక్ జోషి కుటుంబం విమానంలో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో భార్య చివరి కోరిక తీర్చి, లండన్ వెళ్తున్న అర్జున్ భాయ్ కూడా మరణించారు. అర్జున్ భార్య వారం క్రితం చనిపోయింది. ఆమె చివరి కోరిక మేరకు అస్తికలను నదిలో నిమజ్జనం చేసేందుకు ఆయన భారత్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో విగతజీవుడయ్యారు. 8, 4 ఏళ్ల పిల్లలు వారం రోజుల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. వారి దీనపరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అర్జున్‌భాయ్ మనుభాయ్ పటోలియా లండన్‌లో అతడి భార్య, ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. ఇటీవల అర్జున్ భార్య చనిపోయారు.

కంటతడి పెట్టిస్తున్న పైలట్ చివరి మాటలు

విమాన ప్రమాదంలో పైలట్‌ కెప్టెన్‌ సుమిత్‌ సబర్వాల్‌ కూడా కన్నుమూశారు. కెప్టెన్ సుమిత్‌ సభర్వాల్ తండ్రి వయోభారంతో బాధపడుతుండడంతో సుమిత్‌ ఉద్యోగం మానేసి.. ఒంటరిగా ఉన్న తన తండ్రిని చూసుకోవాలని అనుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సుమిత్ తండ్రి డీజీసీఏలో విధులు నిర్వహించి.. పదవీవిరమణ పొందారు. ‘త్వరలో ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా నాన్నా’ అని తన తండ్రికి సుమిత్‌ మాటిచ్చారని.. ఇంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు. ఇప్పుడు అతడి తండ్రి ఒంటరివాడయ్యాడని కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Next Story