Cyber Fraud: సైబర్ ఫ్రాడ్కు బలైన పంజాబ్ మాజీ ఐజీ..

పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ కన్నుమూశారు. భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు నష్టపోయిన ఆయన, తీవ్ర మనస్తాపంతో సోమవారం తన నివాసంలో తుపాకీతో కాల్చుకున్నారు. డైలి జాగరణ్ కథనం ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
పాటియాలాలోని తన నివాసంలో సెక్యూరిటీ గార్డుకు చెందిన రివాల్వర్తో ఆయన కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కొన ఊపిరితో ఉన్న చాహల్ను పార్క్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స ఫలించక ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి 12 నుంచి 16 పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీజీపీ గౌరవ్ యాదవ్ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో, తాను మోసపోయిన తీరును, ఆర్థిక ఇబ్బందులను ఆయన వివరించారు.
గత అక్టోబర్లో ఓ మోసపూరిత కంపెనీలో చాహల్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. మొదట తన సొంత డబ్బు రూ.1 కోటి పెట్టుబడిగా పెట్టగా, ఆ తర్వాత కంపెనీ డిమాండ్ల మేరకు స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు చేసి మిగతా మొత్తాన్ని చెల్లించారు. ఈ మోసంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కూడా ఆయన లేఖలు రాసినట్లు సమాచారం.
అమర్ సింగ్ చాహల్ కెరీర్లో వివాదాలు కూడా ఉన్నాయి. 2015లో జరిగిన బెహబల్ కలాన్, కోట్కపురా కాల్పుల ఘటనల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పలువురు పోలీసు అధికారులపై సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉన్నత హోదాలో పనిచేసిన అధికారి సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడి ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

