G20 Summit security : 1.30 లక్షల మందితో భారీ భద్రత

G20 Summit security : 1.30 లక్షల మందితో భారీ భద్రత
భద్రతా విధుల్లో ఎయిర్ పోర్స్, ఆర్మీ

జీ20 సదస్సుకు భద్రతా ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఈ సదస్సులో 20 దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశాల కోసం ఒక లక్ష 30 వేల మంది భద్రతా సిబ్బంది విధులను నిర్వహించబోతున్నారు. వీరిలో 80 వేల మంది ఢిల్లీ పోలీసులు కాగా మిగిలిన వారు కేంద్ర భద్రతా బలగాలకు చెందినవారు. వీరిలో 45 వేల మంది ఖాకీ దుస్తులు కాకుండా ప్రత్యేకంగా నీలి దుస్తులు ధరిస్తారు.

బుల్లెట్-ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ సేవలందించబోతున్నాయి. ప్రపంచ వేదికపై భారత దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యానికి తగినట్లుగా ఈ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. వీరిలో కమెండోలు హెలికాప్టర్ నుంచి అత్యంత వేగంగా కిందకు దిగే సామర్థ్యం కలిగినవారు. కార్లను చాలా కచ్చితత్వంతో నడపగలిగే నైపుణ్యంగలవారు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తారు. ఎందుకంటే అతిథులను సురక్షితంగా కాపాడుతూ, భద్రత కల్పించవలసిన విధి భారత దేశానికి ఉంది.


మరోవైపు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో గగనతల రక్షణ విధులను భారత వాయు సేన చేపట్టింది. గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను భారత సైన్యం ఏర్పాటు చేసింది. సమగ్ర చర్యలు చేపట్టింది. గగనతలం గుండా ఎదురయ్యే ముప్పులను సమగ్రంగా తిప్పికొట్టేందుకు యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాల సహకారంతో భారత సైన్యం ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా అందుబాటులో ఉంటారు. దేశాధినేతలను తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు రూ.18 కోట్లతో 20 బుల్లెట్-ప్రూఫ్ కార్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది.


న్యూఢిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించారు. అమెరికా నుంచి దాదాపు 20 విమానాలు రాబోతున్నట్లు ఓ అధికారి తెలిపారు. జీ20 సదస్సు జరిగే ప్రగతి మైదానంలో సెక్యూరిటీ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేస్తారు. ఆయనతోపాటు మిగిలిన దేశాల నేతలు బస చేసే హోటళ్ల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మరోవైపు ఈ సమావేశానికి హాజరయ్యే ప్రముఖ నేతల్లో అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ అధినేతలు ఉన్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు బదులుగా ఆ దేశ విదేశాంగ మంత్రి హాజరుకానున్నారు.

అలాగే చిత్రాలు, ఆడియో సమాచారం ద్వారా దుండగులను గుర్తించేందుకు సీసీటీవీల్లో సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు. గతంలో నేరాలు చేసినవారిని ఇవి గుర్తించి, సమాచారాన్ని పంపిస్తాయి. దీనిని ఉపయోగించుకుని న్యూఢిల్లీ నగరంలోకి నేరగాళ్లు ప్రవేశించకుండా నిరోధించవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story