Indo-Pak Conflict: భారత్-పాక్కు జీ7దేశాల విజ్ఞప్తి..!

ఉద్రిక్తతలు తగ్గించాలని జీ7 దేశాలు భారత్-పాకిస్తాన్ని కోరాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని ఓ ప్రకటనలో కోరాయి. సైనిక తీవ్రత ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, రెండువైపులా పౌరుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తక్షణం ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితి శాంతించేందుకు ఇరుదేశాలు చర్చలు జరపాలని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని.. సమస్యకు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం విషయంలో తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో జీ7 దేశాలు పేర్కొన్నాయి.
జూన్ 15 నుంచి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్లో జరగనున్న 2025 జీ7 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో కెనడా అధ్యక్ష పదవిని చేపట్టబోతుంది. ఈ తరుణంలోనే భారత రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటనలో పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు, ఎల్ఓసీ వెంట 26 ప్రదేశాల్లో డ్రోన్లు కనిపించాయని పేర్కొంది. ఇందులో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నాయని పేర్కొంది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బార్మర్, భుజ్, కుర్బెట్, లఖి నాలా వంటి ప్రదేశాల్లో దాడులకు ప్రయత్నించినట్లుగా చెప్పింది. ఫిరోజ్పూర్లో జనావాసాలను లక్ష్యంగా జరిపిన డ్రోన్ దాడిలో స్థానికులు గాయపడ్డారని.. వారిని వెంటనే వైద్య చికిత్సలు అందించినట్లు పేర్కొంది. దాడులను ట్రాక్ చేస్తూ వాటిని భగ్నం చేస్తున్నట్లు తెలిపింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని.. అవసరమైన చోట సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com