Balloon Explosion: లిఫ్ట్లో పేలిన గ్యాస్ బెలూన్లు.. ఇద్దరికి గాయాలు

ముంబయిలో గ్యాస్తో నింపిన బెలూన్లు ఒక్కసారిగా పేలి లిఫ్ట్లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ముంబయి గోరెగావ్ (వెస్ట్) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో బెలూన్లు డెలివరీ చేసేందుకు రాజ్కుమార్ మహతో అనే వ్యక్తి లిఫ్ట్లోకి ఎక్కాడు. అదే సమయంలో వైద్య విద్యార్థిని హిమానీతో పాటు మరో యువకుడు కూడా లిఫ్ట్లోకి వచ్చారు. లిఫ్ట్ కదలకముందే బెలూన్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భయంతో ముగ్గురూ వెంటనే లిఫ్ట్ నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ ఘటనలో రాజ్కుమార్ మహతో, హిమానీకి గాయాలయ్యాయి. అపార్ట్మెంట్లో నిర్వహించనున్న ఓ వేడుక కోసం బెలూన్లను తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బెలూన్ల దుకాణం యజమాని టీకే జైశ్వాల్ సూచనల మేరకు బెలూన్ల డెలివరీ జరుగుతుండటంతో.. ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అతను బెలూన్లకు ఏ రకమైన వాయువు నింపాడో తెలియదు. హీలియం బెలూన్లు మండేవి కావు, కానీ హైడ్రోజన్ బెలూన్లు మండే స్వభావం కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
