Scheme for minor rape victims : అత్యాచారానికి గురైన మైనర్ల కోసం..

అత్యాచార కారణంగా గర్భం దాల్చి, కుటుంబసభ్యులు వదిలేసిన మైనర్లకు ఆర్థిక, వైద్య సాయం అందించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడదుల చేసింది. నిర్భయ నిధుల్లో నుంచి రూ. 74.10 కోట్లను ఇందుకోసం మంజూరు చేస్తున్నట్టుగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ వెల్లడించింది.
అత్యాచార బాధితురాలి శారీరిక, మానసిక హింస వర్ణించలేనిది. వ్యక్తిగతంగా ఆమె పడే బాధ ఒక ఎత్తు, సామాజికంగా ఆమె ఎదుర్కొనే సమస్యలు ఇంకో ఎత్తు. దీనికి తోడు అవాంఛిత గర్భం, అంగీకరించలేని మాతృత్వం, ఆర్థిక సాయం ఇవ్వలేని కుటుంబం ఇవన్నీ ఆమెకు కనపడని శత్రువులే. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది. అత్యాచార ఘటనలతో గర్భం దాల్చిన మైనర్లకు అండగా నిలిచే విధంగా చర్యలు చేపట్టింది. రేప్నకు గురై, గర్భం దాల్చి, కుటుంబసభ్యులు వదిలేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆర్థిక, వైద్య సాయం అందించాలని నిర్ణయించినట్టు కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ వెల్లడించింది.
నిర్భయ నిధుల్లో నుంచి రూ. 74.10 కోట్లను ఇందుకోసం మంజూరు చేసింది. కుటుంబం వదిలేసిన బాలికలకు షెల్డర్, భోజనం, నిత్యావసరాలు, కోర్టుకు వెళ్లేందుకు రవాణా కోసం ఈ నిధులను ఉపయోగించనున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవల్ప్మెంట్ పేర్కొంది. ఈ పథకం కింద బాధితులకు నెలకు రూ. 4వేలు అందుతాయి. ఒకవేళ బిడ్డను ఉంచుకోవడం ఇష్టం లేని మైనర్కు, ఆ బిడ్డను దత్తనిచ్చేందుకు కూడా సహాయం చేయనున్నారు. బాలిక కోరుకున్న విధంగా వైద్య సేవలు, షెల్టర్ హోంలో ఇతర బాలికలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
క్షేత్రస్థాయిలో మైనర్ బాధితులకు సాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు, చిన్నారుల సంక్షేమ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్టు, ఇందుకోసం మిషన్ వాత్సల్యను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరాని వెల్లడించారు.
18ఏళ్ల కన్నా తక్కువ వయస్సు, అనాధలు, కుటుంబసభ్యులు విడిచిపెట్టిన వారు లేదా కుటుంబంతో కలిసి జీవించడం ఇష్టం లేని వారు, పోక్సో చట్టంలో సెక్షన్ 3, సెక్షన్ 5, సెక్షన్ 376, 376ఏ-ఈ కేసుల్లో బాధితులుగా ఉన్న మైనర్లకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ కాపీ లేకపోయినా ఈ స్కీమ్తో లబ్ధి పొందొచ్చు అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com