marriage: పెళ్లి చూపులకు ఒకడు- వివాహానికి మరొకడు

ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లా థానా మిల్ ఏరియా గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హరియాణాలోని పానీపట్ నుంచి 900 కి.మీ దూరం ప్రయాణించి వరుడు వస్తాడని ఎదురు చూసిన వధువు తరఫు వాళ్లకు అనూహ్య షాక్ తగిలింది. వరుడి స్థానంలో మరో వ్యక్తి విచ్చేయడంతో చూసి, అందరూ అవాక్కయ్యారు. వధువు తల్లిదండ్రులకు ఒక యువకుడి ఫొటోను చూపించి పెళ్లి సంబంధాన్ని కుదిర్చిన మధ్యవర్తి (మ్యారేజ్ బ్రోకర్) పెళ్లి చేసుకునేందుకు మాత్రం మరో యువకుడిని పంపింది. దీనిపై బ్రోకర్ రిసు, ఆమె భర్త అజయ్లను పెళ్లి కూతురు తరఫు వారు నిలదీశారు. దీంతో ఆ ఇద్దరు నీళ్లు నమిలారు. "పెళ్లి సంబంధం కుదుర్చుకున్న అసలైన వరుడు రాలేదు. మ్యారేజ్ బ్రోకర్ అతడికి వేరొకరితో పెళ్లి సంబంధాన్ని కుదిర్చిందని తెలిసింది. తాను తెచ్చిన యువకుడి (పవన్ కుమార్)తో అమ్మాయికి పెళ్లి చేయమని బ్రోకర్ వాదించింది. మేం నో చెప్పాం" అని వధువు తరఫు బంధువు సునీల్ కుమార్ తెలిపారు.
నకిలీ పెళ్లికొడుకు అరెస్ట్
'దీనిపై వెంటనే మేం గ్రామ పెద్ద రాజీవ్కు సమాచారాన్ని అందించాం. ఆయన అందించిన సమాచారంతో వెంటనే పోలీసులు వచ్చారు. నకిలీ పెళ్లి కొడుకు, అతడి బంధువులు, మ్యారేజ్ బ్రోకర్ దంపతులు రిసు, అజయ్ సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు' అని సునీల్ వివరించారు. నకిలీ మ్యారేజ్ బ్రోకర్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారని, బహుశా ఈ వ్యవహారం కూడా అలాంటిదే అయి ఉండొచ్చని మిల్ ఏరియా పోలీసు స్టేషన్ ఇన్ఛార్జి రాజీవ్ సింగ్ తెలిపారు. పెళ్లి సంబంధం కుదిర్చినట్టే కుదిర్చి, డబ్బు, బంగారంతో ఉడాయించడమే ఈ తరహా బ్రోకర్ల పని అని ఆయన చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com