Chennai Rains: చెన్నై సహా పలు జిల్లాలో భారీ వర్షాలు.

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చెన్నైలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చెన్నైలోనూ, శివారు ప్రాంతాల్లోనూ బుధవారం నాడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే మంగళ వారం సెలవు ప్రకటించగా జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు బుధవారం కూడా సెలవు ప్రకటించారు. తరువాత బుధ వారం కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ తీర ప్రాంతాల్లో నవంబర్ 13, 14 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) సోమవారం ఎక్స్ పోస్టులో పేర్కొంది. అయితే ఆ వర్షాల ఎఫెక్ట్ ఇప్పటికీ కొనసాగేలా కనిపిస్తోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలని ఐఎండి సూచించింది. అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్కు ఆరెంజ్ అలెర్ట్ను ఐఎండి జారీ చేసింది.

కాగా, మంగళవారం తమిళనాడులో తమిళనాడులోని తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్, తిరువళ్లూరు, చెన్పై, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, పెరంబలూరు, అరియలూరు, తిరుచిరాపల్లి, పుదుక్కోట్టై, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. నవంబర్ ప్రారంభం నుంచి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతవారం కూడా విస్తారంగా వర్షాలు కురవడం వల్ల స్కూల్స్ మూతబడ్డాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు కోస్తా ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరో 24 గంటలపాటు చెన్నైలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ ప్రాంతాల్లో గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
తమిళనాడుకు ఎంతో కీలకమైన ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది ఆలస్యంగా ప్రవేశించాయి. గతవారం సాధారణం కంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. ఆ రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలకు ఈ రుతుపవనాలే పెద్ద దిక్కు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com