ICU Admission: రోగిని ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడంపై కొత్త మార్గదర్శకాలు..

ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో రోగులను అడ్మిట్ చేసుకోవటంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్ లేదా అతడి బంధువులు నిరాకరిస్తే.. సదరు రోగిని దవాఖానలు ఐసీయూలో అడ్మిట్ చేయరాదని స్పష్టంచేసింది. ఈ మేరకు మంగళవారం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఐసీయూలో రోగి అడ్మిషన్, వైద్య చికిత్సకు సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల్ని కేంద్రం తాజాగా వెల్లడించింది. తీవ్ర ఆరోగ్య సమస్య నుంచి రోగిని కాపాడేందుకు మాత్రమే ఐసీయూ అడ్మిషన్ కారణం అవ్వాలని దవాఖానలకు సూచించింది.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో రోగులకు చికిత్సకు సంబంధించి కేంద్రం మంగళవారం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రోగి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రత్యేకంగా రోగులను పరీక్షించడానికి ప్రోటోకాల్స్ అందుబాటులో ఉన్నాయి. భారత్లో పలు సందర్భాల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న సమయంలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఐసీయూలో రోగుల అడ్మిషన్కు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆసుపత్రిలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, వారి బంధువులు నిరాకరించిన సందర్భంలో ఐసీయూలో చేర్చుకోలేరని తెలిపింది.
ఐసీయూ అడ్మిషన్కు సంబంధించిన ఈ మార్గదర్శకాలను క్రిటికల్ కేర్ మెడిసిన్లో ప్రత్యేక అనుభవం ఉన్న 24 మంది ఉన్నత వైద్యుల ప్యానెల్ తయారు చేసింది. రోగిని ఐసీయూలో ఉంచాల్సిన వైద్య పరిస్థితుల జాబితాను ప్యానెల్ రూపొందించింది. ప్రత్యేక పర్యవేక్షణ అవసరమయ్యే ఏ రోగికైనా క్లిష్ట అనారోగ్యం ఉన్న సందర్భాల్లో కూడా ఐసీయూ సిఫారసు చేస్తారు. ప్యానల్లోని నిపుణుల్లోని ఒకరు మాట్లాడుతూ.. ఐసీయూ పరిమిత వనరులున్నాయి. ప్రతి ఒక్కరినీ చేర్చుకోవడం ద్వారా, అత్యవసర కేసుల్లో రోగులు అవసరమైనప్పుడు పడకలు అందుబాటులో ఉండకపోవచ్చని.. కాబట్టి ఈ మార్గదర్శకాలు అవసరమన్నారు. దాంతో రోగి కుటుంబానికి, ఆసుపత్రి పరిపాలనకు మధ్య పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మహమ్మారి లేదా విపత్తు పరిస్థితుల్లో, పరిమిత వనరులున్నప్పుడు పేషెంట్ను ఐసీయూలో ఉంచటానికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. తదుపరి వైద్య చికిత్స సాధ్యం కానప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు, అప్పటివరకు అందిస్తున్న వైద్య చికిత్సతో ఫలితం లేనప్పుడు, ముఖ్యంగా రోగి జీవించే అవకాశం లేనప్పుడు.. ఐసీయూలో చేర్చుకోవద్దని మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది.అలాగే అవయవ వైఫల్యం, ఆర్గాన్ సపోర్ట్ అవసరమైనప్పుడు, రోగి ఆరోగ్యం విషమించే పరిస్థితులు ఉన్నప్పుడు ఐసీయూలో చేర్చుకోవచ్చు. శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి దిగజారితే.. అప్పుడు కూడా పేషెంట్ను ఐసీయూలో కొనసాగించవచ్చు. గుండె, శ్వాసనాళాల్లో సమస్య లు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగుల ను కూడా ఐసీయూలో చేర్చొచ్చు. అలాగే ఐసీయూలో రోగిని చేర్చేముందు.. బీపీ, పల్స్ రేటు, శ్వాసకోశ రేటు, శ్వాస విధా నం, హృదయ స్పందన, ఆక్సిజన్ శాచురేషన్ తదితర అంశాలను పర్యవేక్షించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com