Forest Fire: అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో కార్చిచ్చు..

అరుణాచల్ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. అడవంతా అగ్నికి ఆహుతైపోతోంది. దాంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎంఐ-17V5 హెలికాప్టర్లను మోహరించి నీళ్లు గుమ్మరిస్తోంది.
అయితే, దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి ఈ ఆపరేషన్ చేయాల్సిరావడం రెస్క్యూ టీమ్స్కు పెను సవాల్గా మారింది. అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు భారత వైమానిక దళం, అటవీశాఖ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు. కార్చిచ్చుకిగల కచ్చితమైన కారణాలు ఏవీ ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
ఈ మంటలవల్ల ప్రాణనష్టంగానీ, ఆస్తినష్టంగానీ సంభవించినట్లు ఎలాంటి వివరాలు వెల్లడికాలేవని చెప్పారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా కార్చిర్చు సంభవించిన ప్రాంతానికి పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. వారికి అవసరమైన వసతి ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
