Indian Air Force: త్వరలో భారత్ కు చేరుకోనున్న సీ–295

భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం చేరింది. అత్యాధునిక సైనిక రవాణా విమానం సి-295ను బుధవారం స్పెయిన్లోని సవేల్ నగరంలో జరిగిన కార్యక్రమంలో భారత వైమానిక దళాధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి.. ఎయిర్ బస్ సంస్థ నుంచి అందుకున్నారు.
భారత వాయుసేన అమ్ములపొదిలోకి అత్యాధునిక సైనిక రవాణా విమానం సి-295చేరింది. తొలి విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి మన దేశానికి చేరుకోనుంది. ఈమేరకు బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌధురి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారుల నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత వైమానిక చరిత్రలోనే ఇది మహత్తర క్షణమని పేర్కొన్నారు. ‘‘సి-295ల రాకతో పోరాట ప్రాంతాలకు మన దళాలను పంపే వేగం పెరగనుంది. తొలి విమానం స్పెయిన్ నుంచి వచ్చినా.. 17వది మాత్రం వడోదరాలోనే తయారవుతుంది’’ అని తెలిపారు. వాయుసేనను ఆధునికీకరించాలన్న లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఎయిర్బస్ డిఫెన్స్, స్సేస్ సంస్థతో భారత్.. రూ.21,935 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 56 సి-295 విమానాలను ఆ సంస్థ అందించాలి.
ఇందులో తొలి 16 విమానాలను స్పెయిన్ నుంచి సరఫరా చేస్తుంది. మిగిలిన 40 సి-295లను టాటా సంస్థతో కలిసి వడోదరాలో తయారుచేయనుంది. ఇందుకోసం భారీ తయారీ కేంద్రానికి గతేడాది ప్రధాని మోదీ.. వడోదరాలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే ఈ విమానంలో వినియోగించే విడి భాగాల తయారీ హైదరాబాద్లో ప్రారంభమైంది. 71 మంది సిబ్బందిని లేదా 50 మంది పారాట్రూపర్లను సి-295 విమానాలు మోసుకెళ్లగలవు.
పెద్ద పెద్ద విమానాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు ఈ సీ-295 వెళుతుంది. మిలిటరీ లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే ఉన్నతమైన విమానంగా ఈ సీ-295 పసిద్ధి చెందింది. ఈ విమానాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్లను ఇన్స్టాల్ చేస్తారు. ఇక వీటి తయారీలో దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్ఎస్ఎమ్ఈలు పాలుపంచుకోనున్నాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com