IMD Alert: పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్, మారికొన్నింటికి ఆరెంజ్ అలర్ట్ కూడా

దేశంలో ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. 8 రోజులు ముందుగానే రుతుపవనాలు రావడంతో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ముంబై భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మహారాష్ట, గోవా, కర్ణాటకకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు.
ఇక ముంబై వాసులు ఇంట్లోనే ఉండాలని బీఎంసీ విజ్ఞప్తి చేసింది. అవసరమైతేనే బయటకు రావాలని కోరింది. ఇక పలు భవనాలు సురక్షితం కాదని హెచ్చరించింది. 96 భవనాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపింది. నివాసయోగ్యం కానివిగా గుర్తించింది. భవనాల్లో ఉన్న దాదాపు 3,100 మంది నివాసితులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని సూచించింది.
ఇక దక్షిణ ముంబైలో 13 గంటల్లో 250 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీని వల్ల జలదిగ్బంధం ఏర్పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు ముగిసిన 13 గంటల వ్యవధిలో దక్షిణ ముంబైలో 250 మి.మీ.లకు పైగా భారీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com