Ayodhya Ram Temple: ఢిల్లీ నుంచి అయోధ్యకు విమానం

రామమందిర ప్రారంభం వేళ అయోధ్య నగరానికి విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. డిసెంబర్ 30న దిల్లీలో తొలి విమానం ఉదయం 11కు విమానం బయల్దేరి.. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుతుందని తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 12.50గంటలకు అయోధ్యలో బయల్దేరి 2 గంటల 10నిమిషాలకు దిల్లీకి చేరుతుందని వివరించింది. జనవరి 16 నుంచి రోజువారీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. ఇండిగో కూడా దిల్లీ నుంచి అయోధ్యకు డిసెంబర్ 30న తొలి విమానం నడపనున్నామనీ.. జనవరి 6 నుంచి రోజువారీ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపింది. కాగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిసెంబర్ 14న అయోధ్య విమానాశ్రయానికి DGCA ఏరోడ్రోమ్ లైసెన్స్ను జారీ చేసింది. డిసెంబర్ 30న ఆ ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 22న రామయ్యకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ నాయకులతోపాటు వివిధ రంగాల ప్రముఖులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ఆహ్వానం అందిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదురిని ఆహ్వానించినట్లు వీహెచ్పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. వీరితోపాటు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడను ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం పలికామన్నారు. అదేవిధంగా త్వరలో మిగిలిన విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందుతాయని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
జనవరి 16 నుంచి 22 వరకు అయోధ్య రామాలయ ప్రారంభోత్సం వేడుకలు జరుగనున్నారు. జనవరి 22న రాములవారికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అదేవిధంగా రాముని జీవిత విశేషాలను తెలియజేసేలా రూపుదిద్దిన 100 విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 15 వరకు అన్ని పనులను పూర్తిచేయాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు లక్ష్యంగా పెట్టుకున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com